Muthyalamma: ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.10 లక్షలు ప్రకటించి ప్రభుత్వం..!
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం ఒక ప్రకటన చేశారు. మంత్రి ఆలయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమవేశంలో స్థానిక ఎమ్మెల్యే గణేష్ పాల్గొన్నారు. ఆలయంలో జరిగిన అవాంఛనీయ ఘటనపై ఆందోళన కొనసాగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధ్యులైన వ్యక్తి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
భవిష్యత్ లో ఇలాటి చర్యలు జరగకుండా చూస్తామని చెప్పారు. అక్టోబరు 14న సికింద్రాబాద్ ఆలయంలోకి ఓ వ్యక్తి ప్రవేశించి ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. గమనించిన స్థానికులు వ్యక్తి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాగా ఈ ఘటనను రాజకీయం చేయవద్దని పొన్నం ప్రభాకర్ కోరారు. సికింద్రాబాద్ విగ్రహ ధ్వంసంపై ఉద్రిక్తతలు పెరగడంతో కుమ్మర్వాడిలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. అక్కడ VHP, బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ (BJP) సభ్యులు ఆందోళనకు దిగారు.

ఆందోళనలో 3,000 మందికి పైగా ప్రజలు పాల్గొనట్లు పోలీసులు తెలిపారు. ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒక గ్రూప్ మెట్రో పోలీస్ హోటల్ వైపు.. మరో గ్రూప్ మరో పక్క దూసుకెళ్లేందుకు యత్నించారని పోలీసులు చెప్పారు. దీంతో లాఠీ ఛార్జ్ చేసినట్లు తెలిపారు. నిరసనకారులు పోలీసులపై రాళ్లు, కర్రలు, వాటర్ బాటిళ్లు, చెప్పులు, కుర్చీలు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చిందని వివరించారు.

నిరసనకారుల రాళ్లదాడిలో 15 మంది పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. ఇందులో ఒక ఎసీపీ, ఇన్స్పెక్టర్ కూడా ఉన్నారు. ముత్యాలమ్మ గుడికి సంబంధించి పుకార్లు నమ్మొద్దని పోలీసులు కోరారు. ఈ ఘటనకు సంబంధించి అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శాంతి, భద్రతలు తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. శాంతి, భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.












Click it and Unblock the Notifications