సికింద్రాబాద్ లో నేటినుండి 45రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..దారి మళ్లింపులు; కారణం ఇదే!!
అసలే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఇప్పుడిప్పుడే మళ్లీ హైదరాబాద్లో మళ్ళీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానం మొదలు కావడంతో మళ్లీ రోడ్ల మీద రద్దీ పెరిగింది. వాహనదారులు ఇప్పటికే పెరిగిన రద్దీ నేపధ్యంలో ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ సమయంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలకు తెర తీయడం, వాహనదారులకు మరింత ఇబ్బందిగా మారుతోంది.
సికింద్రాబాద్ సిటీవోలో జంక్షన్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఇప్పటికే హైదరాబాద్ జంట నగరాలలో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. ఇక తాజాగా గురువారం నుండి మరో ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు మొదలయ్యాయి. ఏప్రిల్ 21వ తేదీ నుండి జూన్ నెల 4వ తేదీ వరకు సికింద్రాబాద్ సిటీవోలో జంక్షన్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు ట్రాఫిక్ జాయింట్ సిపి ఏవి రంగనాథ్ వెల్లడించారు.
నేటి నుండి 45 రోజుల పాటు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. నగరంలో నాలాల మరమ్మతుల కారణంగా నేటి నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతాయని ఆయన పేర్కొన్నారు.
రసూల్ పురా నాలా మరమ్మత్తులే కారణం
రసూల్ పురా నాలా మరమ్మతుల కారణంగా సిటీవో జంక్షన్ నుండి రసూల్ పురా వెళ్లే వాహనాలను హనుమాన్ దేవాలయం నుండి ఎడమవైపునకు మళ్ళిస్తున్నట్టుగా పేర్కొన్నారు. అదేవిధంగా రసూల్ పురా నుండి కిమ్స్ ఆస్పత్రి మీదుగా మినిస్టర్ రోడ్ లోకి వెళ్లే వాహనాలు డైవర్షన్ తీసుకోవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఇక బేగం పేట వైపు వచ్చే వాహనాలను కిమ్స్ ఆస్పత్రి మీదుగా మళ్లిస్తామని వెల్లడించారు. వాహనదారులు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ తోపాటు ఎన్టీఆర్ పార్క్, ట్యాంక్ బండ్ మీదుగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని వాహనదారులకు విజ్ఞప్తి
ఇక వాహనదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకుని, ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవి రంగనాథ్ తెలిపారు. అయితే అందరూ వర్క్ ఫ్రమ్ హోం పని చేసిన సమయంలో ఇలాంటి రిపేర్లు చేసుకుంటే బాగుండేదని, ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షలతో మళ్ళీ ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవని భాగ్యనగర వాసులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications