టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు సురభి
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ మరో అభ్యర్థిని ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభీ వాణీదేవిని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఖరారు చేశారు.
కాగా, వాణీదేవి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ స్థానానికి వాణీదేవిని ఎంపిక చేసింది.

తెలంగాణకు చెందిన పీవీ నర్సింహారావు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధాని ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, తెలంగాణకు చెందిన వ్యక్తిగా కేసీఆర్ సర్కారు.. పీవీ జయవంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. 2020 జూన్ 28 నుంచి 2021 జూన్ 28 వరకు అంటే ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవ్సాలను నిర్వహిస్తోంది.
పీవీ ఉత్సవాలను నిర్వహించేందుకు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేకే కేశవరావు నేతృత్వంలో ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీలో మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ తోపాటు పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, పీవీ కుమార్తె వాణీ దేవి కూడా ఉండటం గమనార్హం.
మరోవైపు కాంగ్రెస్ ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి చిన్నారెడ్డి, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి రాములు నాయక్ను ఖరారు చేసింది. ఇప్పటి వరకు వారిద్దరూ నామినేషన్లు కూడా దాఖలు చేశారు. కాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎల్లుండితో నామినేషన్ల గడువు ముగియనుంది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.












Click it and Unblock the Notifications