ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వ వివాదం.. హైకోర్టు ఏమందంటే..!
హైదరాబాద్ : వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మూడు నెలల్లోగా విషయమేంటో తేల్చాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది హైకోర్టు. చెన్నమనేని భారత పౌరుడు కాదంటూ స్థానిక బీజేపీ నేత ఆది శ్రీనివాస్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఆ మేరకు బుధవారం నాడు మరోసారి విచారణ చేపట్టింది న్యాయస్థానం. ఈ విషయంలో తమ అభ్యంతరాలను మూడు వారాల్లోపు కేంద్ర హోంశాఖకు తెలపాలని చెన్నమనేనితో పాటు పిటిషనర్ ఆది శ్రీనివాస్కు సూచించింది.
చెన్నమనేని రమేష్కు భారత పౌరసత్వం లేదని గతంలోనే కేంద్ర హోంశాఖ తేల్చేసింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి గెలిచిన చెన్నమనేనికి భారత పౌరసత్వం లేదంటూ ఆయన ప్రత్యర్థి బీజేపీ లీడర్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో అప్పటినుంచి వివాదం కొనసాగుతోంది. 2010 ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ నుంచి తొలిసారి గెలుపొందిన రమేశ్కు పౌరసత్వానికి సంబంధించి ఎక్కడా అనుకూలంగా తీర్పు రాలేదు. ఇక 2014లో మూడోసారి ఎన్నికైన చెన్నమనేని రమేశ్పై బీజేపీ తరపున పోటీ చేసిన ఆది శ్రీనివాస్ మరోసారి ఫిర్యాదు చేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.

చెన్నమనేనికి భారత పౌరసత్వం రద్దు చేస్తూ అప్పట్లో కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సవాల్ చేశారు. ఆ మేరకు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. భారత పౌరసత్వ చట్టం - 1955లోని సెక్షన్ 10(1) ప్రకారం కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ పిటిషన్ వేశారు. అదలావుంటే తనకు భారత పౌరసత్వం ఇచ్చిన తర్వాత ముప్పై రోజుల్లో మాత్రమే అభ్యంతరాలు చెప్పాలని భారత పౌరసత్వ చట్టం చెబుతోందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో తనపై పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ తనపై చాలా ఆలస్యంగా ఫిర్యాదు చేసినా దానిపై కేంద్ర హోం శాఖ స్పందించిందని ఆ పిటిషన్ లో తప్పుబట్టారు. అంతేకాకుండా, కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications