కారు వైపు విపక్ష నేతల చూపు.. జోరుగా ఆపరేషన్ ఆకర్ష్.. కేసీఆర్ "వంద" నిజం కానుందా?
Recommended Video

హైదరాబాద్ : అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయడానికి కారు రథసారథి కంకణం కట్టుకున్నారా? రాష్ట్రంలో టీడీపీ మాట వినబడకుండా చేయడమే గులాబీ బాస్ పంతమా? ఆ రెండు పార్టీలకు చుక్కలు చూపించడమే మంత్రాంగమా? తాజా పరిణామాలు చూస్తే ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధనం వస్తోంది.
ఆపరేషన్ ఆకర్ష్.. గులాబీ వనానికి కలిసొచ్చిన అంశం. విపక్ష నేతలను ఇట్టే ఆకర్షించగల మంత్రం గులాబీ సొంతం. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాగిన గులాబీ ఆపరేషన్ ఆకర్ష్ కు విపక్ష పార్టీల పునాదులు కదిలిన సందర్భం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మరికొందరు ముఖ్యనేతల్ని కారు ఎక్కించేశారు. ముఖ్యంగా భాగ్యనగరంలో గులాబీ వికసించేలా చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్.. "కారుకు" మంచి మైలేజ్ ఇవ్వడం విశేషం.

ఆపరేషన్ ఆకర్ష్.. విపక్షాలకు చుక్కలేనా?
రెండోసారి అధికారంలోకి వచ్చాక మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు గులాబీ బాస్ కేసీఆర్. విపక్ష నేతలను ఆకర్షించేలా మళ్లీ స్పీడ్ పెంచారు. కారు వైపు వారిని దారి మళ్లించేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు. విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్నారు. ఇప్పటికే వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములు నాయక్, రామగుండం నుంచి గెలిచిన చందర్ పటేల్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో 88 మంది ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థులకు వీరిద్దరు తోడవ్వడంతో గులాబీ బలం 90కి చేరింది. అదలావుంటే ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్ సీఎం కేసీఆర్ ను కలవడం చర్చానీయాంశంగా మారింది. శుభాకాంక్షలు తెలపడం కోసమే మర్యాదపూర్వకంగా కలిశామని చెబుతున్నా.. వీరిద్దరు త్వరలోనే కారెక్కడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.

టార్గెట్ కాంగ్రెస్, టీడీపీ .. కేసీఆర్ వ్యూహమేంటో తెలుసా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో చక్రం తిప్పాలనుకోవడం కేసీఆర్ కు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకేనేమో రాష్ట్రంలో టీడీపీ మాట వినబడకుండా చేయాలనేది ఆయన టార్గెట్ గా కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలను గులాబీ వనానికి రప్పించి ఆ పార్టీకి చెక్ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రత్యేక హోదా లేకుండా చేయాలన్నది కేసీఆర్ అంతరంగంగా కనిపిస్తోంది. శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 12మంది సభ్యులు కావాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ నుంచి 19 మంది గెలిచారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షం ఆ పార్టీయే కానుంది. దీంతో ఓ 10 మంది ఎమ్మెల్యేలకు గులాబీ తీర్థం పోయాలని భావిస్తున్నారట. ఒకవేళ అదే జరిగితే ఇక అసెంబ్లీలో అధికార పక్షానికి తిరుగులేకుండా పోతుంది. ఈ తంతు పూర్తిచేయడానికే మంత్రివర్గ విస్తరణలో ఆలస్యం జరుగుతోందని.. అసెంబ్లీ సమావేశాల నాటికి ఆపరేషన్ ఆకర్ష్ పూర్తిచేయాలనేది గులాబీ బాస్ మంత్రాంగం గా కనిపిస్తోంది.

రాయబారాలు, బేరసారాలు..కేసీఆర్ "వంద" సక్సెసా?
కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను కారు ఎక్కించేందుకే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం చేస్తున్నారనేది ఒక వాదన. ఇప్పటికే కొందరితో రాయబారాలు నడుస్తున్నాయట. మంత్రి పదవులు, నామినేటేడ్ పదవులు, తాయిలాలు.. ఇలా ఏదో ఒకటి ఆశజూపి విపక్ష ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారట. ఆపరేషన్ ఆకర్ష్ తో వారిని కారు ఎక్కించనున్నట్లు సమాచారం. టీడీపీ, కాంగ్రెస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు పార్టీకి ఒకటి చొప్పున మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇదంతా కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే.. కేసీఆర్ మొదటినుంచి చెబుతున్నట్లుగానే టీఆర్ఎస్ బలం "వంద" కు చేరనుంది.

కేటీఆర్ మాటల మంత్రం.. అపొజిషన్ క్యాడర్ అట్రాక్టయ్యేనా..!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ జిల్లాల పర్యటన కూడా ఆపరేషన్ ఆకర్ష్ కు మంచి వేదిక కానుంది. ఇప్పటికే సిరిసిల్ల, వరంగల్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. పార్టీశ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. పార్టీకి పునాదులు మీరేనంటూ.. ఎళ్లవేలలా మీకు అండగా ఉంటాననే భరోసా ఇచ్చారు. అంతేకాదు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసి.. కార్యకర్తలకు కష్టమొస్తే ఆదుకునే విధంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇదంతా కూడా టీఆర్ఎస్ కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వడమే గాకుండా.. ఇతర పార్టీల క్యాడర్ కూడా గులాబీ గూటివైపు చూసే అవకాశముంది. కాంగ్రెస్, టీడీపీలో ఉంటే తమకు న్యాయం జరగదేమో అనే రీతిలో ఆ రెండు పార్టీల కార్యకర్తలు ఆలోచించే ఛాన్సయితే కనిపిస్తోంది. ఒకవేళ టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల ద్వారా ఆ పార్టీ క్యాడర్ కు పనులు జరిగితే మాత్రం కచ్చితంగా విపక్ష పార్టీల నుంచి పెద్దసంఖ్యలో వలసలు ఉంటాయని చెప్పొచ్చు. మొత్తానికి జిల్లా పర్యటనల్లో తారకరాముడి మాటల మంత్రంతో గులాబీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ కానుందనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications