బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి, ధ్వంసం
హైదరాబాద్: సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్లోని అరవింద్ నివాసాన్ని ముట్టడించి ఇంటిలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత ఇంట్లోని ఫర్నీచర్, సామాగ్రి ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు.
కవితపై అనుచిత వ్యాఖ్యలంటూ అరవింద్ ఇంటిపై దాడి
ఎంపీ అరవింద్ ఇంటి ముట్టడికి వెళ్లిన టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇటీవల ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. కవిత పార్టీ మారతారని చెప్పడంతోపాటు ఆయన మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు.
నిజామాబాద్లో అరవింద్.. భయాందోళనలో ఆయన తల్లి
ఈ దాడి ఘటనతో అరవింద్ తల్లి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా ఇంటిపైకి వచ్చి దాడులు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఈ దాడి జరిగిన సమయంలో ఎంపీ అరవింద్ హైదరాబాద్లో లేరు. నిజామాబాద్లో కలెక్టరేట్లో నిర్వహించిన దిశ సమావేశంలో ఆయన ఉన్నారు. హైదరాబాద్లో టీఆర్ఎస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో నిజామాబాద్లో ఎంపీ ఇంటి వద్ద పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.
కవితపై ధర్మపురి అరవింద్ ఏమన్నారంటే..?
ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధమున్న కవితకు బీజేపీలో చోటు లేదని ఎంపీ అరవింద్ అన్నారు. ఆమెను తీసుకొస్తామన్న వారిని కూడా ఉపేక్షించమని అన్నారు. అలా తీసుకొచ్చేవారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధ్యక్షుడు బండి సంజయ్ ను డిమాండ్ చేస్తానని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో కవిత టచ్లో ఉన్నారని ఆరోపించారు.
కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే దాడి అంటూ అరవింద్
దాడి ఘటనపై ఎంపీ అరవింద్ స్పందిస్తూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకే హైదరాబాద్లోని తన నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని మండిపడ్డారు. ఇంట్లో వస్తువులు పగలగొడుతూ బీభత్సం సృష్టించారని అన్నారు. ఇంట్లో ఉన్నతన తల్లిని బెదిరించారని పేర్కొంటూ పీఎంవో, ప్రధాని నరేంద్ర మోడీలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications