లాక్డౌన్: దివ్యాంగుల కోసం తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. రాష్ట్రంలోని దివ్యాంగులకు, వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దివ్యాంగులు మందుల కోసం బయటకు వెళ్లినప్పుడు ఇబ్బందులు రాకుండా వారితోపాటు వారి సహాయకులకు పోలీసులు పాస్ లు మంజూరు చేయాలని స్పష్టం చేసింది.
లాక్డౌన్ సమయంలో దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గణేష్ కర్నాటి అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. దివ్యాంగులకు అవసరమైన అత్యవసరమైన చికిత్సలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆస్పత్రుల్లోని ఎమర్జెన్సీ విభాగాల వైద్య సిబ్బందికి తెలపాలని స్పష్టం చేసింది.
నిత్యావసరాలు, ఔషధాలను దివ్యాంగుల ఇంటి వద్దకే చేర్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంతేగాక, దివ్యాంగుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను పత్రికలు, మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. జిల్లా పరిధిలోని దివ్యాంగుల వివరాలు సేకరించి వారి బాగోగులు చూసుకోవాలని తెలిపింది. తమ ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ మే 13లోగా నివేదిక సమర్పించాలని ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
లాక్ డౌన్ సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు సిద్ధంగా ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది పవన్ కుమార్ ఆయా సంస్థల జాబితాను హైకోర్టుకు సమర్పించారు. ఆ జాబితాను పరిశీలించిన హైకోర్ట్.. సేవలు చేసేందుకు సిద్ధంగా ఉన్న ఎన్జీవోలు, కార్పొరేట్ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అలాగే, రాష్ట్రంలోని వలస కార్మికులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది.