టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు: నేడు సిట్ విచారణకు రేవంత్ రెడ్డి.. ఏం జరుగుతుందో!!
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో నేడు సిట్ విచారణకు రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. దీంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ చోటు చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజ్ రగడ రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వెనుక కేటీఆర్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేస్తున్న రాజకీయ నేతలపై ఫోకస్ చేసిన సిట్ ఈ నేపథ్యంలోనే టిపిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
ఇటీవల రేవంత్ రెడ్డి పేపర్ లీకేజీ లో ఐటీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడు తిరుపతి హస్తం ఇందులో ఉందని గత ఏడాది అక్టోబర్లో టిఎస్పిఎస్సి నిర్వహించిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షల్లో సిరిసిల్ల పరిధిలోని గ్రామాలలో వందల మంది అభ్యర్థులు 100కు పైగా మార్కులు తెచ్చుకున్నారని ఆరోపణలు చేశారు. వారందరిని ఒకసారి విచారిస్తే ఈ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటూ పేర్కొన్నారు.

ఇక ఈ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న సిట్ అధికారులు దీనికి సంబంధించిన ఆధారాలను అందించాలని రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి తరహాలో బండి సంజయ్ కు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది సిట్. ఈనెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు సిట్ ఎదుట విచారణకు హాజరుకావాలని రేవంత్ రెడ్డికి పంపిన నోటీసులలో పేర్కొంది.
అయితే సిట్ పంపించిన నోటీసులను తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యులు, సిబ్బంది నిరాకరించారు. నోటీసులు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులను గోడకు అంటించారు సిట్ అధికారులు. అయితే సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతానని తన దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తానని ఇప్పటికే ప్రకటించిన రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వాలని లేకపోతే దీనిపై హైకోర్టుకు వెళతా అంటూ స్పష్టం చేశారు.
సిట్ అధికారి శ్రీనివాస్ కేటీఆర్ బావమరిది అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ కోసమే తనకు రాజకీయ కక్షలో భాగంగా నోటీసులు ఇచ్చారని స్పష్టం చేశారు. ఇక ఈ క్రమంలో నేడు సిట్ విచారణకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సిట్ విచారణలో రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు? ఆపై ఏం చేయబోతున్నారు? అన్నది ఉత్కంఠ గా మారింది.












Click it and Unblock the Notifications