ప్రయాణికులకు ఆర్టీసీ షాక్: టోల్ఛార్జీల భారం రూ. 5-20 వరకు పెంపు
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఒక్క టోల్ గేట్కు రూ. 4 నుంచి 5 పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా టోల్ ఛార్జీలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నాయి. ఆర్టీసీ బస్సుల ఛార్జీలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూడు టోల్ గేట్లు ఉన్న ఖమ్మం, విజయవాడ రూట్లలో ఎక్స్ప్రెస్ సర్వీసులకు గతంలో ఉన్న ఛార్జీలకంటే రూ. 10 పెరగ్గా.. డీలక్స్ ఆపై సర్వీసులకు రూ. 20 పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన టోల్ చార్జీలు అమల్లోకి రాగా.. టీఎస్ఆర్టీసీ అధికారులు బస్సు ఛార్జీలను పెంచి.. టిమ్ మిషన్లలో ఆయా మార్పులు చేశారు. అయితే, ఛార్జీల పెంపుపై ఆర్టీసీ ఎలాంటి ప్రకటనా ఇవ్వకపోవడం గమనార్హం. కానీ, ఈ ఛార్జీల పెంపు సామాన్యులపై భారం ఉండదని ఆర్టీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు.

ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 28 లక్షల మంది ప్రయాణిస్తున్నారని.. ఇందులో సిటీలో 12 లక్షల మంది, పల్లె వెలుగు బస్సుల్లో 12 లక్షల మంది జర్నీ చేస్తున్నారని తెలిపారు. వీరికి చార్జీల పెంపు భారం వర్తించదని, మిగతా 4 లక్షల మందికి మాత్రమే అదనపు భారం పడనుందన్నారు. చార్జీలు పెంచినప్పటికీ ఆయా టోల్ గేట్ల వద్ద డబ్బులు చెల్లించిన తర్వాత, ఆర్టీసీకి అదనంగా రూ.5 లక్షల ఆదాయం వస్తుందని తెలిపారు.
రెండు టోల్ గేట్ల మధ్య దూరం సుమారు 60 నుంచి 70 కిలో మీటర్లు ఉంటుందని, ఒక టోల్ గేట్ దాటే పల్లె వెలుగు బస్సులు 99% ఉన్నాయని తెలిపారు. కాగా, విజయవాడ, ఖమ్మం రూట్లో రూ.20 పెంపు..
హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్లే ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులకు టికెట్పై రూ.10 పెరిగింది. విజయవాడ, ఖమ్మం జిల్లాకు వెళ్లే డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సుల టికెట్ ధరలు ప్రస్తుతం ఉన్న దాని కంటే రూ.20 పెరిగింది. ఈ రెండు మార్గాల్లో మూడు టోల్ గేట్లు ఉన్నాయి. ఈ రెండు రూట్లు మినహా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా మూడు టోల్ గేట్లు లేవని అధికారులు చెబుతున్నారు.
పెరిగిన బస్సు చార్జీలతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్చి చివరి తేదీ వరకు హైదరాబాద్ - ఖమ్మం ఎక్స్ప్రెస్ బస్సు టికెట్ 270 రూపాయలు ఉంటే.. ఇప్పుడు అదనంగా 20 రూపాయలు వసూలు చేస్తూ 290 రూపాయలు చేసింది. హైదరాబాద్ - కొత్తగూడెం 347 ఉన్న పాత చార్జీల ప్లేస్ లో కొత్తగా 390 రూపాయలు వసూలు చేస్తుంది. హైదరాబాద్ - సిద్ధిపేట ఎక్స్ప్రెస్ బస్సుకు పాత చార్జీ 140 రూపాయలు ఉంటే ఇప్పుడు అధనంగా ఐదు రూపాయలు పెంచింది.












Click it and Unblock the Notifications