టీఎస్ఆర్టీసీ సమ్మె, సకల జనుల సమరభేరికి అనుమతి ఇచ్చిన కోర్టు
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకల జనుల సమరభేరికి రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యహ్నం రెండు గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు సభను నిర్వహించుకోవాలని కోరింది. రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లో నిర్వహించనున్న సభకు పలు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. కాగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సభకు అనుమతిని నిరాకరించారు.
దీంతో ఆర్టీసీ ఐకాస నేతలు మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సభను మధ్యహ్నాం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. సభ నిర్వహించేందుకు ఆర్టీసీ కార్మికులు ఏర్పాట్లు చేసుకుంటుండడంతో ప్రభుత్వం అనుమతిని అర్థాంతరగా నిరాకరించడంతో పిటిషన్ను అత్యవసరంగా విచారణ జరిపాలని కార్మిక జేఏసీ హైకోర్టును కోరింది. దీంతో లంచ్మోషన్ పిటిషన్ను విచారించిన కోర్టు అనుమతిని మంజూరు చేసింది.
ఇక ఆర్టీసీ సమ్మెను మరింత ఉదృతం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆక్టోబర్ ముప్పైవ తేదిన సకల జనుల సభ సమరభేరిని సరూర్నగర్లో నిర్వహించాలని ఆర్టీసీ ఐకాస నిర్ణయించింది.. సకల జనుల సమరభేరికి ప్రజా సంఘాలతో పాటు, అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులతోపాటు పలు పార్టీల నేతలు కూడ సభకు హజరు కానున్నట్టు తెలుస్తోంది. కాగా మరోసారి సమ్మెపై కోర్టు తీర్పును వాయిదా వేసింది. వాదనల్లో భాగంగా ప్రభుత్వంపై కోర్టు సీరియస్ అయింది. అధికారులు తప్పుడు సమాచారం ఇస్తూ.. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కార్మికులను సమ్మె ఆపమని ఆదేశించలేమని పేర్కోంది. కోర్టు తీర్పుతో సమ్మె యధావిధిగా కొనసాగనుంది.