TSRTC STRIKE:కార్మికుల ఉద్యోగం తొలగించే అధికారం లేదు, బెదిరింపులకు అదరం, కేసీఆర్ పై అశ్వత్థామ..
ఆర్టీసీ కార్మికులను విధుల నుంచి తొలగించే అధికారం సీఎం కేసీఆర్కు లేదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న కార్మికులను బెదిరించడం సరికాదన్నారు. తమకు డెడ్లైన్ విధించకుండా మంత్రిమండలి కమటీ వేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. యాజమాన్య కమిటీ వేసి డిమాండ్లపై చర్చలు జరిపితే స్వాగతించే వారమని పేర్కొన్నారు. కానీ బెదిరింపు ధోరణి సరికాదని స్పష్టంచేశారు. మంగళవారం చేపట్టనున్న రహదారుల దిగ్బందన కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నట్టు తెలిపారు. ఆ రోజు పరీక్ష ఉండటంతో నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
కేసీఆర్ కామెంట్లపై ఫైర్
మంత్రిమండలి సమావేశం తర్వాత శనివారం రాత్రి సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు బేషరతుగా 5వ తేదీ అర్ధరాత్రిలోపు విధుల్లో చేరాలని స్పష్టంచేశారు. అప్పటివరకు విధుల్లో చేరినవారినే ఉద్యోగులుగా పరిగణిస్తామని చెప్పారు. కేసీఆర్ కామెంట్లను ఖండించారు. తమ అడ్వకేట్ వాదనలను కూడా తప్పుబట్టడం సరికాదన్నారు. ఆయన నీతి, నిజాయితీకి మారుపేరని.. అడ్వకేట్ జనరల్ పదవీ వదులుకొన్న గొప్ప మనిషి అని చెప్పారు.
ఎలా ఇస్తారు..? మరీ మిగతావారు
కొత్తగా 5100 ప్రైవేట్ బస్సులకు అనుమతి ఎలా ఇస్తారని అశ్వత్ధామ ప్రశ్నించారు. ఆ బస్సులు నడిపేందుకు 27 వేల మంది కార్మికులు అవసరమవుతారు. మరి 2100 మంది బస్సుల సంగతేంటీ ? ఆయా కార్మికుల పరిస్థితి ఏంటి అని అడిగారు. అసెంబ్లీలో చేసిన చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని అశ్వత్థామ ప్రశ్నించారు. డీజిల్కు సంబంధించి వ్యాట్, జీఎస్టీ విధించడం ఏంటి అని ప్రశ్నించారు. దీంతోపాటు మున్సిపాలిటీ సిబ్బంది వారు తమ బకాయి ఎందుకు చెల్లించడం లేదని నిలదీశారు.
తీసే అధికారం ఎక్కడిదీ..?
ఆర్టీసీ ఉద్యోగులను తీసే అధికారం సీఎం కేసీఆర్కు అధికారం లేదని అశ్వత్థామ అన్నారు. బేషరతుగా ఉద్యోగాల్లో చేరమని అంటున్నారు.. మరి జీతాల సంగతి ఏంటీ అని ప్రశ్నించారు. తర్వాత జీతం ఇవ్వమని చెబితే ఏం చేయాలి అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరొద్దని సూచించారు. ఆత్మగౌరవంతో ఉద్యమిద్దామని కోరారు. 2 శాతం ఉద్యోగులు విధుల్లో చేరేందుకు ముందుకొచ్చారని తెలిపారు. వారు కూడా ఆలోచించాలని కోరారు. ఆర్టీసీ బస్సులు తగ్గితే డిపోలు కూడా 45కి చేరతాయని చెప్తున్నారు. దీంతో మేనేజర్లు, డీవీఎం, ఆర్ఎం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా సమ్మెకు మద్దతు తెలుపాలని అశ్వత్థామ పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలకు కూడా అండగా ఉంటామని స్పష్టంచేశారు.
ఏకపక్ష నిర్ణయాలు సరికాదు...
ప్రస్తుతం ఆర్టీసీ సావ్యంగా సాగుతుందని అశ్వత్థామ తెలిపారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. బీసీ, ఎస్సీలకు ఉద్యోగ నియామక ప్రక్రియ సవ్యంగా సాగుతుందన్నారు. ఇక ప్రైవేట్ పరం చేస్తే ఏముంటుందని వాపోయారు. ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఒకవేళ యూనియన్లతో గొడవ అని చెబితే.. రద్దుచేసుకోవడానికి సిద్ధమని చెప్పారు. కానీ డిమాండ్లు పరిష్కరించాలని అశ్వత్థామ తెలిపారు. యూనియన్లు ఇప్పటివీ కాదని 1920లో పుట్టినవని.. 1926లో అమల్లోకి వచ్చాయని తెలిపారు.