లిక్కర్ అనుకున్నారు.. తాగి ప్రాణాలు పోగొట్టుకున్నారు.. భువనగిరిలో విషాదం..
లాక్ డౌన్ పీరియడ్లో మందుబాబులకు కరువు వచ్చిపడ్డ సంగతి తెలిసిందే. వైన్ షాప్స్ అన్నీ మూతపడటంతో లాక్ డౌన్ ముగింపుకు రోజులు లెక్కపెట్టుకుంటూ ఇంట్లో కాలం వెల్లబుచ్చుతున్నారు. ఎక్కడైనా మద్యం దొరక్కపోదా అని ఆశగా ఫ్రెండ్స్ సర్కిల్స్లో ఆరా తీస్తున్నారు. ఎవరైనా తాము దాచుకున్న మద్యాన్ని ఆఫర్ చేస్తే.. ఆ పూటకు అదే పండగా అనుకుంటున్నారు. అయితే ఎక్కడా మద్యం దొరకనివాళ్లు మాత్రం దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పినట్టు జుట్టు పీక్కుంటున్నారు. కానీ కొంతమంది లేనిపోని ప్రయోగాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
తాజాగా భువనగిరిలో ఇద్దరు యువకులు మద్యం అనుకుని స్పిరిట్ తాగి మృతి చెందారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. షేక్ బాబా,ఎండీ రియాజ్ అనే ఇద్దరు యువకులు కొంతకాలంగా మద్యం లేక అల్లాడుతున్నారు. ఇదే క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఎక్కడినుంచో స్పిరిట్ బాటిల్ తీసుకొచ్చారు. మద్యం అనుకుని దాన్ని సేవించారు. కాసేపటికే తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారిద్దరూ మృతి చెందారు.
భువనగిరి పట్టణంలో ఈ ఇద్దరూ బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నట్టు స్థానికులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మద్యం అనుకుని స్పిరిట్ తాగారా.. లేక స్పిరిట్ అని తెలిసే మత్తు కోసం తాగారా.. లేక మరేదైనా కుట్ర ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.