ఏకగ్రీవం సరే.. ప్రభుత్వ నజరానా ఏమాయే.. 10 లక్షలు వచ్చేదెన్నడో?
హైదరాబాద్ : కొత్త పంచాయతీలు కొలువుదీరి ఆర్నెళ్లు గడుస్తోంది. అయితే పాలన మాత్రం గాడిలో పడలేదు. సర్పంచులకు చెక్ పవర్ ఇబ్బందులు మొదలు మరెన్నో కష్టాలు పంచాయతీలను వెంటాడుతున్నాయి. ఇక సంపూర్ణంగా ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం నజరానాగా ప్రకటించే 10 లక్షల రూపాయలు ఇంతవరకు చెల్లించకపోవడం గమనార్హం.
ఎన్నికలు జరగకుండా వార్డుమెంబర్లు సహా సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకుంటే ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అలాంటి పంచాయతీలకు 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ఆ మేరకు ఆ డబ్బులు గ్రామాభివృద్ధికి వినియోగించుకోవచ్చనే కారణంతో చాలాచోట్ల పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. కానీ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఇంతవరకు పంచాయతీలకు డబ్బులు అందకపోవడంతో సర్పంచులు నిరాశతో ఉన్నారు.

ప్రభుత్వ నజరానా కోసం ఎదురుచూపులు
రంగారెడ్డి జిల్లాలోని ఏకగ్రీవ పంచాయతీలు ప్రభుత్వం ఇస్తానన్న 10 లక్షల రూపాయల నజరానా కోసం ఎదురుచూస్తున్నాయి. కనీసం ఆ డబ్బులతోనైనా గ్రామాభివృద్ధికి బాటలు వేయాలనుకుంటున్న సర్పంచులకు నిరాశే మిగులుతోంది. పంచాయతీ ఎన్నికలు జరిగి ఆర్నెళ్లు గడుస్తున్నా.. ఇంతవరకు ప్రభుత్వ నజరానా అందకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు ప్రభుత్వం నజారానా ప్రకటించడంతో చాలాచోట్ల యునానిమస్ అయ్యాయి. ఆ క్రమంలో ప్రభుత్వానికి భారీగా ఎన్నికల ఖర్చు తప్పింది. ఒక్కో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు తక్కువలో తక్కువ లక్ష రూపాయలకు పైగా ఖర్చవుతుందనేది ఒక అంచనా. అయితే జిల్లాలో 75 పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో ప్రభుత్వానికి భారీగా ఖర్చు తగ్గినట్లైంది. అటు అభ్యర్థులకు కూడా ఎన్నికల ఖర్చు తప్పినట్లైంది.

10 లక్షల నజరానా ఎప్పుడొచ్చేనో..!
జిల్లాలోని 565 పంచాయతీలకు గాను 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచులకు అధికంగా అధికారాలు కట్టబెట్టడంతో పల్లెల్లో తీవ్ర పోటీ ఏర్పడింది. లీడర్లతో పాటు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, కాస్తో కూస్తో పలుకుబడి కలిగినవారు సర్పంచ్ బరిలో నిలిచారు. దాంతో పంచాయతీ ఎన్నికలు కాస్ట్లీగా మారాయి. ఇక అర్బన్ ప్రాంతాలను ఆనుకుని ఉన్న పంచాయతీల్లో పోటీ ఎక్కువగా కనిపించింది. ఆ స్థానాల్లో సర్పంచ్ కుర్చీ దక్కించుకోవాలని కొందరు 50 లక్షల నుంచి కోటికి పైగా ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
అదలావుంటే మెజార్టీ గ్రామపంచాయతీలను తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవాలను ప్రోత్సహించింది. ఆ క్రమంలో ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల రూపాయల నజారానా ప్రకటించింది. అయితే ఎన్నికలు జరిగి ఆర్నెళ్లు గడుస్తున్నా ఇంతవరకు దాని ఊసే లేకపోవడం గమనార్హం.

జడ్పీ నిధుల విడుదలలో కూడా జాప్యమే
జిల్లాలో 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 75 పంచాయతీలు యునానిమస్ అయ్యాయి. అయితే వాటిలో 71 పంచాయతీల్లో సర్పంచులతో పాటు వార్డు మెంబర్లు సైతం ఏకగ్రీవమయ్యారు. వాటినే సంపూర్ణ ఏకగ్రీవ పంచాయతీలుగా ప్రభుత్వం గుర్తించింది. ఒక్కో గ్రామపంచాయతీకి 10 లక్షల రూపాయల చొప్పున నజరానా ఖాతాలో జమచేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఆ ప్రోత్సాహకాల మొత్తం ఇంతవరకు జమ కాకపోవడంతో సర్పంచులు నిరాశకు గురవుతున్నారు.
అదలావుంటే ప్రభుత్వం ప్రకటించిన 10 లక్షల రూపాయలకు తోడు జడ్పీ నిధుల నుంచి మరో 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు జిల్లా పరిషత్ ఛైర్మన్ సునీతా రెడ్డి. అటు ప్రభుత్వ ప్రోత్సాహకం.. ఇటు జడ్పీ నిధులు ఒకేసారి విడుదలైతే గ్రామాభివృద్ధికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఆ పెద్ద మొత్తాలు రాక.. పంచాయతీ ఖజానాలో డబ్బులు లేక కొత్త సర్పంచులు తలలు పట్టుకునే పరిస్థితి తయారైంది.












Click it and Unblock the Notifications