హైదరాబాద్ సిటీకి మరో ఆకర్షణ: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం, దేశంలోనే పెద్దది!
హైదరాబాద్: నగరానికి అదనంగా మరో ఆకర్షణీయ నిర్మాణం జతకలిసింది. శుక్రవారం రాత్రి కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి..
ఈ తీగల వంతెన అందుబాటులోకి రావడంతో మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గనున్నాయి. కాగా, దుర్గంచెరువుపై నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి కావడం గమనార్హం. ఎల్ఈడీ లైట్ల వెలుగుల్లో వంతెన అందాలు మరింతగా కనవిందు చేస్తున్నాయి.

184 కోట్ల వ్యయం.. విదేశీ ఇంజినీర్లతో..
ఇక వంతెన విశేషాలను గమనించినట్లయితే.. రూ. 184 కోట్ల వ్యయంతో 754.38 మీటర్ల పొడవున ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో వంతెనను పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో మొత్తం 13 ఫౌండేషన్లు ఏర్పాటు చేశారు. ఇక స్టే కేబుళ్లను ఆస్ట్రియా నుంచి తెప్పించారు. దుర్గం చెరువు పరిసరాల్లో పర్యావరణం దెబ్బతినకుండా కేవలం రెండు పిల్లర్లపై ఈ వంతెనను ఎల్అండ్టీ సంస్థ నిర్మించింది. 8 దేశాల ఇంజినీర్లు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

తగ్గనున్న ట్రాఫిక్ ఇబ్బందులు.. శని, ఆదివారాలు బంద్
ఈ బ్రిడ్జి ప్రారంభం కావడంతో జూబ్లీహిల్స్ నుంచి మైండ్ స్పేస్, గచ్చిబౌలికి దాదాపు 2 కి.మీ మేర దూరం తగ్గుతుంది. అంతేగాక, భారీ ట్రాఫిక్ అంతరాయం నుంచి తప్పించుకోవచ్చు. అయితే,, ఈ బ్రిడ్జిపైకి ప్రతి శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించరు. వారంతాల్లో కేవలం పర్యాటకులకు మాత్రమే కాలినడకన అనుమతిస్తామని జీహెచ్ఎంసీ వెల్లడించింది. కాగా, దుర్గం చెరువును కూడా ప్రభుత్వం పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది.












Click it and Unblock the Notifications