హైదరాబాద్ : రాత్రి వేళ గుర్తు తెలియని గ్యాంగ్ హల్చల్-బయట కనిపించినవారిపై దాడులు
లాక్ డౌన్ వేళ హైదరాబాద్లో రాత్రిపూట గుర్తు తెలియని గ్యాంగ్ హల్చల్ చేస్తోంది. రాత్రి వేళల్లో బయట తిరుగుతున్నవారిపై ఈ గ్యాంగ్ దాడులకు పాల్పడుతోంది. సీసీటీవీ ఫుటేజీలో ఈ గ్యాంగ్ సంచరిస్తున్న దృశ్యాలను పోలీసులు గుర్తించారు. చేతుల్లో కర్రలు పట్టుకుని బైక్లపై తిరుగుతూ.. బయట కనిపించినవారిపై వీరు దాడులకు పాల్పడుతున్నారు. బాలాపూర్ కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ గ్యాంగ్పై నిఘా పెట్టారు.
స్థానికుల ఫిర్యాదు ప్రకారం... బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షహీన్ నగర్,పరిసర ప్రాంతాల్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళ బైక్లపై హల్చల్ చేస్తున్నారు. బయట కనిపించిన వ్యక్తులపై జులుం ప్రదర్శిస్తూ వారిపై దాడులకు తెగబడుతున్నారు. సామాన్య ప్రజలు వారిని పోలీసులుగా భావించి... ఆ బైక్లు కనిపించగానే పరిగెత్తుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రస్తుతం ఈ గ్యాంగ్ను పట్టుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. ఆకతాయి యువతే ఈ చర్యలకు పాల్పడుతున్నట్లుగా అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ సహా రాష్ట్రమంతా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే ప్రభుత్వం సడలింపునిచ్చింది. ఆ తర్వాత పాసులు ఉన్నవారు మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంది. అయితే కొంతమంది యువత పనీ పాట లేకపోయినా అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నారు. అలాగే గల్లీల్లో,కాలనీల్లో అంతా ఒకచోట చేరి టైమ్ పాస్ చేస్తున్నారు.
Recommended Video
ఇలాంటి టైమ్ పాస్ మూకలపై ఫోకస్ చేయాలని ఇటీవల డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు ఆదేశించారు. అప్పటినుంచి ప్రధాన రహదారులతో పాటు గల్లీలపై కూడా పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. అనవసరంగా బయట తిరిగితే బండిని సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నెల 30 వరకు కొనసాగనున్న లాక్ డౌన్ను ప్రభుత్వం పొడగిస్తుందా లేక లాక్ డౌన్ను ఎత్తివేస్తుందా అన్నది మరో రెండు రోజుల్లో తెలియనుంది. ఈ నెల 30న జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది. లాక్ డౌన్ కొనసాగిస్తూనే ఆంక్షలను సడలించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.