పౌరసత్వ చట్టంకు నిరసన: హైదరాబాద్ ఉర్దూ రచయిత ‘పద్మశ్రీ’ వాపస్
హైదరాబాద్: పౌరసత్వం చట్టం(సీఏఏ), జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ)లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలతోపాటు ప్రముఖులు కూడా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న వారికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఉర్దూ రచయిత, హాస్యవేత్త ముజ్తాబా హుస్సేన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

పద్మశ్రీ వాపస్..
తన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని ముజ్తాబా హుస్సేన్ బుధవారం ప్రకటించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా అంశాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దేశంలో పరిస్థితి నానాటికీ దిగజారుతోందని ఆయన అన్నారు.

ఇలాంటి పరిస్థితులు చూడలేదు..
తాను ఇటువంటి సంఘటనను చూడలేదని అన్నారు. గంగా-యమునా తెహ్జీబ్ సంస్కృతి మరుగునపడుతోందని అన్నారు. మతం, ద్వేషాలతో దేశం విడిపోతోందన్నారు. ఒక సాధారణ ఉర్దూ రచయితగా తాను సీఏఏ 2019 చట్టాన్ని వ్యతిరేకిస్తూ తనకు ప్రదానం చేసిన పద్మశ్రీ బిరుదును వాపస్ చేస్తున్నాను అని హుస్సేన్ వ్యాఖ్యానించారు.

2007లో పద్మశ్రీ..
ఉర్దూ సాహిత్యంలో హుస్సేన్ చేసిన కృషికి 2007లో భారత ప్రభుత్వం హుస్సేన్కు పద్మశ్రీ బిరుదును ప్రదానం చేసింది. ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. కాగా, సీఏఏ 2019 చట్టం ముస్లిం దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి మనదేశంలోకి శరణార్థులుగా వచ్చిన హిందూ, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, పార్శీ మొదలైన మైనార్టీలకు భారతీయ పౌరసత్వాన్ని ఇవ్వడానికి ఉద్దేశించింది. డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారతదేశంలోకి వచ్చిన శరణార్థులకు వర్తిస్తుంది.

శరణార్థుల కోసమేనంటూ..
ఇప్పటికే ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, టీఎంసీ సహా ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి. దేశంలోని పలు యూనివర్సిటీల్లో విద్యార్థులు కూడా ఆందోళనలు చేపట్టారు. అయితే, పౌరసత్వం చట్టం ద్వారా దేశంలోని ఏ మతానికి చెందిన భారతీయులకు కూడా నష్టం లేదని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇది కేవలం మనదేశానికి వచ్చిన శరణార్థుల కోసమేనని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టంపై వెనక్కి తగ్గేది లేదని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications