బీమా ఏమైంది సారూ...? జాతీయ రాజకీయాలపై ఇంట్రెస్ట్.. కేసీఆర్పై రాములమ్మ ఫైర్
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ లక్ష్యంగా రాములమ్మ విజయశాంతి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బీమా పథకం ఏమైందో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్కు జాతీయ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ.. రైతుల సంక్షేమంపై లేదని విమర్శించారు. అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద కక్షతో తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచుతున్నారని దుయ్యబట్టారు.

అన్నదాతలకు గోసలె
కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాతలు అరిగోసలు పడుతూనే ఉన్నారని గుర్తుచేశారు. సీఎం సారుకు జాతీయ రాజకీయల మీద ఉన్న ధ్యాస రైతుల మీద లేదన్నారు. పంటల బీమా అమలుపై కేసీఆర్ సర్కార్ ఎటూ తేల్చడం లేదన్నారు. ఈ సీజన్లో మే 5 నాటికే విడుదల కావాల్సిన పంటల బీమా నోటిఫికేషన్ ఇప్పటికీ రాలేదు. గత రెండేండ్లుగా ఫసల్ బీమా యోజనను కేసీఆర్ సర్కార్ అమలు చేయడం లేదు. బెంగాల్ తరహాలో మన రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా పంటల బీమా పథకం తెస్తమని చెప్తున్నా.. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదని విజయశాంతి అన్నారు.

రైతులకు నష్టం..
పంటలకు బీమా లేక... అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులతో ఏటా మన రైతులు నష్టపోతున్నారని విజయశాంతి గుర్తుచేశారు.కేంద్రం మీద కక్షతో తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచుతున్నారని ఫైరయ్యారు. రైతులకు భరోసా ఇవ్వడం కోసం పంటల బీమా తప్పనిసరిగా అమలు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. గతంలో జాతీయ పంటల బీమా పథకం అమలులో ఉండగా, 2016 నుంచీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా, యూనిఫైడ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పథకాలు అమలయ్యాయని గుర్తుచేశారు.

నాలుగేళ్లు.. ఆ తర్వాత
రాష్ట్రంలో 2016 నుంచి 2019 వరకు నాలుగేళ్లు ఫసల్ బీమా పథకాన్ని అమలు చేశారని విజయశాంతి పేర్కొన్నారు. ఆ తర్వాత 2020 వానాకాలం నుంచీ పంటల బీమా పథకాలు అన్నింటినీ పక్కన పెట్టేశారని చెప్పారు. అలా ఎందుకు చేశారో ఇంతవరకు కేసీఆర్ సర్కార్ చెప్పలేదన్నారు. రాష్ట్ర రైతులు 2020 ఖరీఫ్, రబీ సీజన్లలో భారీ వర్షాలు, వడగండ్లు, ఈదురు గాలులతో తీవ్రంగా నష్టపోయారు. 2021లో పలు జిల్లాలో అకాల వర్షాల వల్ల వరి, పత్తి, మిరప రైతులకు తీవ్ర నష్టం కలిగింది. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించిన మంత్రులు... పరిహారం అందిస్తమని హామీలిచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఇన్పుట్ సబ్సిడీని కూడా ప్రభుత్వం బంద్ చేసిందని.. గత రెండేండ్లలో పంటల బీమాకు బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదన్నారు. దీని వల్ల తెలంగాణ రైతులు ఎన్నో విధాలుగా నష్టపోయారు.












Click it and Unblock the Notifications