ఈ నెల 27, 28న ఓటరు జాబితా సవరణ కార్యక్రమం..!నగర యువత సద్వినియోగం చేసుకోవాలన్న ఈసీ.!
హైదరాబాద్ : ఎలాంటి తప్పులు లేని నిర్ధిష్టమైన ఓటరు జాబితా కోసం ఈ నెల 27, 28వ తేదీలలో ఓటరు జాబితా సవరణ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఓటరు జాబితాలో నూతన ఓటరుగా నమోదు మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం జీహెచ్ఎంసీ కల్పిస్తున్నందున నగరంలోని ప్రజందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ తెలిపారు. జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తయిన వారు నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారి సూచించారు. నిర్ధిష్టమైన ఓటరు జాబితా కొరకు 2021 సంవత్సరపు ముసాయిదా ఓటరు జాబితాను భారత ఎన్నికల సంఘం నవంబర్ 1వ తేదీన విడుదల చేసిన నేపథ్యంలో అదే జాబితాలో పేరు మార్పు, చిరునామా మార్పు తదితర సవరణలు, చేర్పుల కోసం ప్రత్యేక ప్రచార సవరణల కార్యక్రమంలో సరిచేసుకోవచ్చని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నగర వాసులు తమ సమీప పోలింగ్ బూత్ లో విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాతో పాటు, ఉదయం10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారి అందుబాటులో ఉంటారని ఎన్నికల అధికారులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో సరిచూసుకోవాలని, తేడా ఉంటే వెనువెంటనే మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో ఇట్టి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల అదికారి కోరారు. నూతన ఓటరు నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవలన్నారు. ఓటరు జాబితాలో పేరు తొలగింపుకు ఫారం-7, తప్పుల సవరణకు ఫారం-8, ఒకే నియోజక వర్గంలో మార్పుకు ఫారం-8A, ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారితో పాటు, జిహెచ్ఎంసీ కమిషనర్ నగర ప్రజలకు సూచిస్తున్నారు.