ఐటీ, ఈడీ దాడులకు అదరం, బెదరం:పళ్లా రాజేశ్వర్ రెడ్డి
టీఆర్ఎస్ నేతలు లక్ష్యంగా ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. కేంద్ర సంస్థలను రాజకీయమయం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థల సిబ్బందిని వారి కార్యకర్తల్లా వాడుకుంటున్నారని మండిపడ్డారు.
దేశంలో 4 వేలమందిపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరిగాయని పేర్కొన్నారు. వారిలో 3,900 మంది బీజేపీలో చేరారని రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఒకప్పుడు అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న వారు ఇప్పుడు బీజేపీలో చేరగానే నీతిమంతులు అయిపోతారా? అని ప్రశ్నించారు.
ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని భావిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలాంటి దాడులకు భయపడబోరని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ రైడ్ చేసుకుంటారో చేసుకోండి, ఏ కేసు పెట్టుకుంటారో పెట్టుకోవాలని కోరారు.
దాడులకు భయపడి ఇతర పార్టీల్లో చేరే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మల్లారెడ్డి మీద దాడి జరుగుతుందని అన్నారు. తెలంగాణ బిడ్డలం అని, తెలంగాణ కోసం ఉద్యమం చేసి జైలుకు కూడా వెళ్లొచ్చినవాళ్లు రాష్ట్రంలో ఉన్నారని తెలిపారు. అదే స్ఫూర్తితో దాడులపై పోరాడతామని రాజేశ్వర్ రెడ్డి ఉద్ఘాటించారు.