స్వాతంత్ర వజ్రోత్సవాలు గర్వంగా నిర్వహించుకున్నాం.!జనరల్ బాడీ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి.!
హైదరాబాద్: స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో 15 రోజుల పాటు నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు విజయవంతంగా నిర్వహించుకున్నామని, భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తినిచ్చేలా ఈ వజ్రోత్సవాల సందర్భంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకూ పాల్గొని విజయవంతం చేశారని నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మి తెలిపారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జిహెచ్ఎంసి అధికారులు ప్రశాంతంగా నిర్వహించారని, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో 4 లక్షల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన 4వ జనరల్ బాడీ సమావేశం ప్రశాంతంగా జరిగింది.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు దిగ్విజయం..
రాచరికం నుండి ప్రజాస్వామ్యంలో అడుగుపెట్టి సెప్టెంబర్ 17 నాటికి 74 సంవత్సరాలు పూర్తయినందున 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను మూడు రోజుల పాటు కన్నులపండువగా జరుపుకోవడం జరిగిందని మేయర్ తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ ఎస్.ఆర్.డి.పి, మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన పనుల గురించి వివరించారు. రానున్న బతుకమ్మ పండుగ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈ సందర్భంగా మహిళా మణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా నగర వాసులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు మేయర్ విజయలక్ష్మి.
జీహెచ్ఎంసీ పరిదిలో అనేక అభివృద్ది పనులు.
అంతే కాకుండా సభ్యులు లేవనెత్తిన సమస్యలను అధికారులు సరైన విధంగా జవాబు చెప్పారు. ప్రజా సమస్యల పట్ల సుదీర్ఘ చర్చ జరగడంతో 4వ జనరల్ బాడీ మీటింగ్ ప్రశాంతంగా జరిగింది. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో వివిధ పథకాల ద్వారా మోడల్ ఫిష్ మార్కెట్లను ఏర్పాటు చేశామని ప్రాజెక్ట్ సి.ఇ దేవానంద్ సభ్యులకు వివరించారు. ఎస్.ఎన్.డి.పి ద్వారా రూ. 985 కోట్లతో జిహెచ్ఎంసి మరియు చుట్టుపక్కల మున్సిపాలిటీలలో మొత్తం 60 పనులు చేపట్టగా అందులో జిహెచ్ఎంసి పరిధిలో రూ. 733 కోట్లతో 37 పనులను చేపట్టగా 35 పనులు వివిధ అభివృద్ధి దశలో కలవని, మరో రెండు పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఇ.ఎన్.సి జియా ఉద్దీన్ తెలిపారు. సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఈ.ఎన్.సి సవివరంగా సమాధానం ఇచ్చారు.
మౌళిక సదుపాయాలు మరింత మెరుగు..
ట్యాక్స్ కలెక్షన్ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం వసూలు చేయడం జరుగుతుందని, సెల్ఫ్ అసెస్మెంట్ పద్దతి ద్వారా భవన యజమానులు ఆస్తిపన్ను చెల్లిస్తున్నారని, ఇప్పటి వరకు రూ. 1122 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేశామని అడిషనల్ కమిషనర్ శ్రుతి ఓజా వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల పెండింగ్ ఆస్తి పన్నులను సభ్యులు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ డి.ఎస్.లోకేష్ మాట్లాడుతూ... పబ్లిక్ యూటిలైజేషన్ ముఖ్యంగా హాస్పిటల్స్, స్కూల్స్, పోలీస్ శాఖలకు సంబంధించిన భవనాల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయని, ఈ బకాయిలు 1996 సంవత్సరం నుండి ఉన్నట్లు కమిషనర్ తెలిపారు.
నిమజ్జనాన్ని విజయవంతం చేసుకున్నాం..
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభజన చట్టంలో పొందుపరిచిన 58:42 శాతం నిర్దేశించిన ప్రకారం గా చెల్లించడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేసిందని, అయినా ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో నిధులను కూడా మంజూరు చేస్తుందని కమిషనర్ వివరించారు. మొఘల్ పుర స్టేడియంలో మౌలిక వసతులు, కోచ్ లను ఏర్పాటు చేయాలని ఎం.ఐ.ఎం కార్పొరేటర్ అడిగిన ప్రశ్నకు అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి మాట్లాడుతూ... 233 కోచ్ పోస్టులు భర్తీ చేయుటకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతి రాగానే వెంటనే నియమించుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.