ఆ దేశంలోని మైనార్టీలు ఏమయ్యారు?: సీఏఏపై వెనక్కితగ్గేది లేదంటూ కిషన్ రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్: విభజన సమయంలో పాకిస్థాన్లో ఉన్న మైనార్టీలంతా ఇప్పుడు ఏమయ్యారు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇందిరా పార్క్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వారి కోసమే సీఏఏ..
పాకిస్థాన్, బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీల రక్షణ కోసం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చామని ఆయన తెలిపారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ను ఇస్లామిక్ దేశాలుగా మార్చారని.. ఇప్పుడు పాకిస్థాన్లో మైనార్టీలు 3 శాతానికి పడిపోయారని తెలిపారు. పాకిస్థాన్లో మైనార్టీలు హత్యలకు గురవుతున్నారని అన్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికే మన్మోహన్ సింగ్ హయాంలో చట్టం తేవడానికి యత్నించారని.. అయితే, కార్యరూపం దాల్చలేదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం 2015లోనే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని.. కానీ, రాజ్యసభలో మెజార్టీ లేని కారణంగా అప్పుడు ఆమోదం పొందలేకపోయిందని కిషన్ రెడ్డి వివరించారు.
మోడీ ప్రభుత్వంపై కుట్ర.. వెనక్కితగ్గేది లేదు
ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఏ ఒక్క భారతీయుడికీ వ్యతిరేకంగా లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని నిరసనలు చేసినా.. ఎంత రెచ్చగొట్టినా సీఏఏను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. స్వదేశీ శక్తులు, విదేశీ శక్తులు కలిసి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. రాహుల్ గాంధీ తీరు చదివిస్తే ఉన్న మతిపోయిందన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.
కిషన్ రెడ్డి హెచ్చరిక..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది విధ్వంసకారులు పోలీసులపై దాడులకు పాల్పడ్డారని గుర్తు చేసిన ఆయన.. పోలీసులకు రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. హింసాత్మక దాడిలో పాల్గొన్న వారి నుంచే నస్ట పరిహారం వసలూ చేస్తామని చెప్పారు. ఆర్థిక రంగంతోపాటు అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని అన్నారు.
ఆ మూడు పార్టీలు ఒక్కటే..
ప్రతిపక్షాలు సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ మూడు పార్టీలు ఒక్కటేనని.. టీఆర్ఎస్, కాంగ్రెస్లను నడిపించేది ఎంఐఎం పార్టీనేనని అన్నారు. హోంశాఖ మంత్రిగా ఉన్న మహమూద్ అలీని కేసీఆర్, అసదుద్దీన్ ఇద్దరూ అవమానించారని అన్నారు. 135ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.