సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు ముఖ్య గమనిక!
జనరల్ కోచ్ లో ప్రయాణించేవారికి నాణ్యమైన, సరసమైన భోజనాన్ని అందించే ఉద్దేశంతో రూ.20, రూ.50కే 'ఎకానమీ మీల్స్'ను రైల్వే ప్రవేశపెట్టింది. 'జన్ ఆహార్ సర్వీస్' కౌంటర్ల ద్వారా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికి హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలోనే అత్యంత రద్దీ రైల్వేస్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ స్టేషన్లో ఈ సౌకర్యం ఎప్పుడు కల్పిస్తారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
ఐఆర్సీటీసీ రైల్వే క్యాంటిన్ సికింద్రాబాద్ స్టేషన్లో అందుబాటులో ఉండేది. జనాహార్ హోటల్ ద్వారా తక్కువ ధరకు ఆహారాన్ని సరఫరా చేసేవారు. స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నామనే పేరుతో ఉన్న దాన్ని తొలగించారు. ఆ తర్వాత మాత్రం కార్పొరేట్ కంపెనీల రెస్టారెంట్లు, ఫుడ్ స్టాల్స్ తెరచుకున్నాయి. సామాన్యుడికి ఆహారం అందించే జనాహార్ క్యాంటిన్ ను మాత్రం అధికారులు తెరవలేకపోయారు. ఆరు సంవత్సరాలుగా ప్రయాణికులు ఖరీదైన భోజనాన్ని కొనలేక అవస్థలు పడుతున్నారు. తక్కువ ధరకే ఆహారం అందుతుందేమోనని ఎదురు చూస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజు 240 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిల్లో 1.80 లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణికులకు రిజర్వేషన్ బోగీలవద్దకు ఆహారం వెళుతోందికానీ జనరల్ బోగీల పరిస్థితి గురించి ఆలోచించేవారే లేరు. రైల్వే జనరల్ బోగీ ప్రయాణికులను లెక్కలోకి తీసుకోవడంలేదంటూ రైల్వే యూజర్స్ అసోసియేషన్ మండిపడుతోంది.
ఇక్కడే ఐఆర్సీటీసీ ఆధునిక కిచెన్ను నిర్మిస్తున్నట్టు గతంలో ప్రకటించింది. ప్రయాణికులు తిరగని ప్రాంతంలో దీని ఏర్పాటుకు నిర్ణయించారు. చివరకు అది కూడా ఏర్పాటు చేయలేకపోయారు. రూ.710 కోట్లతో స్టేషన్ పునరాభివృద్ధి పనులు జరుగుతున్నాయికానీ అందులో నుంచి కొన్ని రూపాయలను సామాన్యులకు ఆహారం అందించే జనాహార్ క్యాంటిన్ ఏర్పాటు కోసం ఉపయోగించలేని దుస్థితిలో రైల్వే ఉంది. ఇకనైనా సామాన్యులకు నాణ్యమైన భోజనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications