కేటీఆర్, సంతోష్ ఎక్కడ.. బృందంతో ఎందుకు లేరు: రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వంపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. గత 3 నెలలుగా ధాన్యం కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కల్లాల్లో కుప్పలు, ఇంటి ముందు శవాలుగా రైతుల పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. రైతు సమస్య వివరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గడ్డి పెట్టి పంపించారని సెటైర్లు వేశారు.

25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం
వరంగల్ గోడౌన్లోని 25 వేల మెట్రిక్ టన్నుల బియ్యం గోల్ మాల్పై కేంద్రం నిలదీస్తే దొంగలా మాదిరిగా పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. సెంట్రల్ హాల్లో ఫొటోలు దిగి పార్లమెంట్లో ఆందోళన చేసినట్లు తప్పుదోవపట్టిస్తున్నారని ఫైరయ్యారు. చావుడప్పులో కేసీఆర్, కేటీఆర్, కవిత ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారని.. మంత్రుల బృందం ఏం తేల్చిందని నిలదీశారు.

సరఫరా చేయలే
ఖరీఫ్ పంట టార్గెట్ పూర్తిగా ఎందుకు సరఫరా చేయలేదో రైతులకు, కేంద్రానికి కేసీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఎంత సరఫరా చేస్తారో చెప్పకుండా అదనపు పంట కొంటామని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యాసంగి పంట గురించి ఎందుకు నిలదీయడం లేదన్నారు. రైతులు చనిపోతుంటే కేటీఆర్, సంతోష్రావు విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరు రోజులుగా కేటీఆర్, సంతోష్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.

కేటీఆర్, సంతోష్ ఎక్కడ
మంత్రుల బృందంలో కేటీఆర్, ఎంపీల బృందంలో సంతోష్రావు ఎందుకు లేరని ప్రశ్నించారు. ఖరీఫ్లో ఎంత కొంటారో చెప్పేవరకు, యాసంగి బాయిల్డ్ రైస్ కొంటామని చెప్పేవరకు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఏదీ తేలకుండా మంత్రుల బృందం వెనక్కి వస్తే ప్రజలు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు. ప్రజలను మభ్యపెట్టడానికి బీజేపీ, టీఆర్ఎస్ నేతలు వీధి నాటకాలకు తెరలేపారని ధ్వజమెత్తారు.

ప్లీజ్.. ధైర్యంగా ఉండండి
రైతులకు రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతులు ఎవరూ తొందరపడి చనిపోవద్దు, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డిసెంబర్ 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహిస్తామని చెప్పారు. రైతులు అందరూ ఎర్రవెల్లికి తరలి రావాలని పిలుపునిచ్చారు. టీ పీసీసీ ముఖ్యనేతలు అంతా పాల్గొంటారని రేవంత్రెడ్డి వివరించారు.












Click it and Unblock the Notifications