ఉగ్రవాదులకు సహకరించేవారిని శాశ్వతంగా ఏరేస్తాం .. ఇండియా ధర్మసత్రం కాదన్న మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జి. కిషన్ రెడ్డి దేశంలో ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని శాశ్వతంగా ఏరివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. భారత దేశం ధర్మ సత్రం కాదన్నారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు సేఫ్ జోన్ గా ఉందని కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.

హైదరాబాద్ టెర్రరిస్ట్ లకు సేఫ్ జోన్ గా మారిందన్న మంత్రి కిషన్ రెడ్డి ..ఉగ్రవాదులకు సహకరించేవారిని ఏరేస్తామని వార్నింగ్
మయన్మార్, బంగ్లాదేశ్ నుండి వచ్చి ఓల్డ్ సిటీ లో చాలా మంది అక్రమంగా ఉంటున్నారని వారిపై చర్య తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ టెర్రరిస్ట్ లకు సేఫ్ జోన్ గా మారిందని పేర్కొన్నారు. ఎక్కడ ఏ ఉగ్ర దాడులు జరిగినా మూలాలు హైదరాబాద్ లో ఉంటున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు సహకరించేవారిని శాశ్వతంగా ఏరేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దేశ సమగ్రత, ఐక్యత, భద్రతే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు . కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం నాడు ఓ మీడియా చానెల్తో మాట్లాడారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించిన మోడీకి ధన్యవాదాలు తెలిపిన ఆయన నేషనల్ సిటిజన్ రిజిస్టర్ తయారీపై ప్రధానంగా దృష్టి సారించినట్టు చెప్పారు.

నేషనల్ సిటిజన్ రిజిస్టర్ తయారీపై ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
పోలీసుశాఖను ఆధునీకరించి బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దుతామన్నారు. బీజేపీలో చేరేందుకు చాలా మంది సంప్రదిస్తున్నారని చెప్పిన కిషన్ రెడ్డి అందరినీ కూడ చేర్చుకొంటామని తేల్చి చెప్పారు.నేషనల్ సిటిజన్ రిజిస్టర్ తయారీపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్టు ఆయన తెలిపారు. దేశాభివృద్ధితో పాటు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చెయ్యటానికి కృషి చేస్తానని చెప్పారు.

విభజన హామీల సాధనకు కృషి .. 2023 లో అధికారం లక్ష్యం అన్న మంత్రి
తమ లక్ష్యం 2023 లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం అని చెప్పారు. తెలంగాణా రాష్ట్రానికి అవసరమయితే కేంద్రమంత్రిగా సహకారం అందిస్తానని చెప్పారు. హోం శాఖలో పరిస్థితులపై త్వరలో సమీక్ష నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ తమ నినాదం అని చెప్పిన కిషన్ రెడ్డి దేశ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగేలా చూస్తామని పేర్కొన్నారు. విభజన హామీలు ఏవైనా పెండింగ్ వుంటే వాటి సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు.

తెలంగాణలో వ్యూహాత్మకంగా అడుగులు వెయ్యనున్న బీజేపీ
ఇక తెలంగాణకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించిన బీజేపీ సైతం తెలంగాణా రాష్ట్రంపై దృష్టి సారిస్తుంది. పార్టీని బలోపేతం చెయ్యాలని భావిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణాకు ప్రాధాన్యతనిస్తూ కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు స్థానాలు గెలుచుకున్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో మరిన్ని స్థానాల లక్ష్యంగా టీఆర్ ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారేందుకు ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా అడుగులు వెయ్యాలని భావిస్తుంది.












Click it and Unblock the Notifications