మహిళలను వేధించాడు..బట్టలూడదీసి ఉతికారేశారు
సనత్ నగర్ : మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. ఎటు చూసినా ఈ నేరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి . పోలీస్ స్టేషన్లలో కూడా మహిళా వేధింపుల కేసులే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇక మహిళలను వేధిస్తున్న ఆకతాయిలు పొరపాటున చేతికి చిక్కితే చాలు... వారికి మహిళలే దేహశుద్ధి చేస్తున్నారు. తాజాగా సనత్నగర్లోని జింకలవాడలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.
సనత్నగర్ రైల్వే స్టేషన్కు ఎదురుగా ఉన్న జింకలవాడలో ఓ యువకుడికి దేహశుద్ధి చేశారు స్థానిక మహిళలు. పట్టపగలే ఇళ్లల్లోకి దూరి వారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న అంజి అనే వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అంజి ప్రతిరోజు దారిన పోయి వచ్చే మహిళలను తన విపరీతమైన ప్రవర్తనతో చాలా ఇబ్బందికి గురిచేసేవాడని మహిళలు చెబుతున్నారు. అంతేకాదు వారితో చాలా అసభ్యకరంగా ప్రవర్తించేవాడని చెప్పారు. చిన్న పిల్లలను సైతం విడిచేవాడు కాదని వారిని కూడా లైంగికంగా వేధించేవాడని సమాచారం.
అంజి చేష్టలు వికృత రూపం దాలుస్తుండటంతో స్థానికులు అతన్ని పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. బట్టలు విప్పి అర్థనగ్నంగా స్తంభానికి కట్టేసి మరీ చితకబాదారు మహిళలు. రోజురోజుకు అంజి ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలానే ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇప్పటికి దేహశుద్ధే చేశామని మళ్లీ మహిళలను వేధిస్తే ఎలాంటి చర్యలకు అయినా దిగుతామని అంజికి వార్నింగ్ ఇచ్చారు.