ys shamila అనూహ్య వ్యాఖ్యలు -యుద్ధం -కుక్కలు మొరుగుతాయ్ -గుండె అలిసిందన్న ఏపూరి సోమన్న
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతోన్న వైఎస్ షర్మిల తన ప్రత్యర్థులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పోరాటం అంత సులభమైందేమీ కాదని, ఒక పెద్ద కొండను ఢీకొడుతున్నానని ఎరుకేనని ఆమె అన్నారు. అయినాసరే చిత్తశుద్ధి, చేయిచేయి కలిపి పోరాడితే యుద్ధంలో తప్పక విజయం సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాగాయకుడు ఏపూరి సోమన్నను పార్టీలోకి ఆహ్వానిస్తున్న సందర్భంలో షర్మిల ఈ కామెంట్లు చేశారు. ఇంకా..

గజ్జెకట్టిన కాళ్లకు వందనం
వందలాది మంది కళాకారులతో కలిసి కవి, గాయకుడు ఏపూరి సోమన్న సోమవారం హైదరాబాద్ లో వైఎస్ షర్మిలను కలిసి, ఆమె పెట్టబోయే పార్టీలో చేరారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ''ఏపూరి సోమన్న ప్రతి మాట ఒక తూటా. తెలంగాణకు ఊపిరి ఆట పాట. రాష్ట్ర సాంస్కృతిక జీవనమే జానపదం. రచయితలకు, గాయకులకు నా నమస్కారాలు. గజ్జె కట్టిన కాళ్లకు నా పాదాభివందనాలు. నాపై నమ్మకంతో కలిసి పనిచేయడానికి వచ్చిన ఏపూరి సోమన్నకు, వారి అనుచరులకు స్వాగతం. మనం ఎందుకు పోరాటం చేయాలన్నది మరోసారి గుర్తుచేసుకోవాలి..

యుద్ధం ఎవరితోనో తెలుసు
వైఎస్సార్ కేవలం ఐదేళ్లు మాత్రమే సీఎంగా పనిచేశారు. కానీ జీవిత కాలాలు గుర్తుండిపోయేలా సంక్షేమ పథకాలు అందించి వెళ్లారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక 700 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఎక్కువ మంది తెలంగాణవారే ఉన్నారు. వైఎస్సార్ బిడ్డగా పుట్టడం నా అదృష్టం. తెలంగాణలో రాజన్న రాజ్యం మళ్లీ రావాలి. ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించే పాలకులు రావాలి. అందుకే ఈ పోరాటం. మనం ఎవరితో యుద్ధం చేస్తున్నానో బాగా తెలుసు. ఒక పెద్ద కొండను ఢీకొడుతున్నాం. ఈ యుద్ధంలో తమ్ముడు ఏపూరి సోమన్న మద్దతుగా నిలవడం సంతోషం'' అని వైఎస్ షర్మిల అన్నారు. ఇక

ఎన్టీఆర్ తర్వాత వైఎస్సారే
షర్మిలకు మద్దతు తెలిపిన అనంతరం సోమన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి హక్కుల పోరాటం చేశానని.. తన జీవితం పాటకే అంకితమైందన్నారు. ఇరవై ఏళ్ల కిందట ప్రారంభమైన తన పాట ఎంతోమందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందని చెప్పారు. తమ పార్టీలోకి రావాలంటూ చాలా మంది ఆహ్వానించినా వెళ్లలేదని.. వైఎస్సార్ అంటే తనకు ఎంతో అభిమానం ఉందని ఆయన తెలిపారు. తెలుగు గడ్డపై మహనీయుడైన ఎన్టీఆర్ ఎంతో వైఎస్సార్ కూడా అంతేనని.. రాజన్న బిడ్డ షర్మిలకు సగౌరవంగా మద్దతు పలుకుతున్నామని తెలిపారు. ఆమెతో నడవడంలో తనకు ఎంతో తృప్తి ఉందన్నారు.

కేసీఆర్ దగా.. ఏసీల్లో కాంగ్రెస్ నేతల
''విద్యార్థులు, బహుజనుల త్యాగాలతో గద్దెనెక్కిన కేసీఆర్.. దళితుడికి సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నతో నా మలి దశ పోరాటం మొదలైంది. నిరుద్యోగులకు ఆశ చూపించి.. ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నాడు. కళాకారులను టీఆర్ఎస్ కూలీలుగా మార్చారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసినవారి కుటుంబాలకు కేసీఆర్ ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. ఉద్యమకారులు చితికిపోగా, అసలు ఉద్యమంతో సంబంధం లేని చాలా మంది ఇవాళ బుగ్గకార్లలో తిరుగుతున్నారు. జనంలో నిలబడి పోరాడాల్సిన కాంగ్రెస్ నేతలు మాత్రం ఏసీ గదుల్లో కూర్చొని తామే సీఎం అభ్యర్థులమంటూ కొట్లాడుకుంటున్నారు...

మొరిగే కుక్కల్ని పట్టించుకోను..
నా పాట కేసీఆర్ ను భయపెట్టింది. అందుకే నన్ను జైల్లో వేసి నా గొంతుపోయేలా కుట్రలు చేశారు. ప్రభుత్వం నాపై కుట్రచేస్తే, మనసున్న జడ్జి, లాయర్లు నన్ను కాపాడారు. నేను ఆత్మగౌరవంతో బ్రతికేవాన్ని. నాపై మొరిగే ప్రతీ కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా తొక్కేసారు. మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు. తుంగతుర్తి నుంచి చట్ట సభల్లోకి వెళ్లాలని ఉంది. చట్టాలు చేసే దగ్గర నా గొంతు వినిపించాలని నాకు ఆశ ఉంది. ఇప్పటికే నా గుండె ఆలసి పోయింది. నా కలను నెరవేర్చుకోడానికి వైఎస్ షర్మిల అవకాశం కల్పిస్తానన్నారు. రాబోయే 30, 40 సంవత్సరాలు షర్మిలక్కతోనే కొనసాగుతా..'' అని ఏపూరి సోమన్న చెప్పారు.












Click it and Unblock the Notifications