నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా... ఈటల రాజేందర్ పార్టీలో చేరికపై వైఎస్ షర్మిల
మాజీమంత్రి ఈటల రాజేందర్ను వైఎస్ షర్మిల తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈటల రాజేందర్ వస్తానంటే ఆహ్వానిస్తామని అన్నారు. పార్టీ నాయకులతో లోటస్ పాండ్లో బుధవారం సమావేశమయ్యారు. కేసులకు భయపడి ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని ఆమె కామెంట్ చేశారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం కామన్ అని, కేసులకు భయపడి బీజేపీలో చేరడం కూడా కామన్ అయిపోయిందన్నారు.

వస్తానంటే వద్దంటానా...
తమ పార్టీలోకి ఈటల రాజేందర్ వస్తానంటే ఆహ్వానిస్తామని షర్మిల అన్నారు. ఇప్పటివరకు ఈటల రాజేందర్ విషయంలో ఎలాంటి చర్చ లేదని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి పేరుతోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉంటుందని వివరించారు. టేబుల్ ఫ్యాన్ గుర్తుపై ఫూలిష్ ప్రచారం జరుగుతోందని ఖండించారు. ఇప్పటివరకు గుర్తు ఎంపికపై ఎటువంటి చర్చ జరగలేదని వివరించారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని పార్టీ విధి, విధానాలు రూపొందిస్తామన్నారు.

నేర్వని పాఠాలు..
కరోనా విషయంలో ఇప్పటివరకు కేసీఆర్ పాఠాలు నేర్చుకోలేదన్నారు. కోవిడ్ను ఎదుర్కొనే ఉద్యేశ్యం కేసీఆర్కు లేదని, నిద్రపోతున్నట్టు నటిస్తున్న వారికి ఏం చెప్పలేమన్నారు. నటించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని స్పష్టంచేశారు. ఇదీ అందరికీ తెలుసు అని చెప్పారు. కరోనా కాలంలో ప్రజలు పడ్డ ఇబ్బందులు తెలుసు అని వివరించారు. ఏపీలో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చారని.. మరీ తెలంగాణలో ఎందుకు చేర్చలేదని అడిగారు. దీంతో పేదలు చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు.

బీజేపీలో చేరిక..?
ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీలో చేరబోతున్నారు. కానీ ఇంతలో షర్మిల పార్టీలోకి ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈటల అంశం చర్చకు వచ్చింది. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ లేదా ఆయన భార్య జమున పోటీ చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications