ఆసీస్తో తొలి టెస్ట్: తెలుగబ్బాయికి ఛాన్స్ ఉండదా? డైలమాలో టీమిండియా: గిల్, సాహా వైపే
అడిలైడ్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మరో మూడు రోజుల్లో టెస్ట్ సిరీస్ ఆరంభం కాబోతోంది. సుమారు నెల రోజుల పాటు సాగే సుదీర్ఘమైన సిరీస్ ఇది. ఈ నెల 17వ తేదీన ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లూ గాయాలబారిన పడ్డారు. మరికొందరు ఫామ్ను కోల్పోయి సతమతమౌతున్నారు. ఈ పరిస్థితుల్లో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. రోహిత్ శర్మ లేకపోవడం వల్ల టీమిండియా ఓపెనర్ బ్యాట్స్మెన్ కొరతను ఎదుర్కొంటోంది. రోహిత్ శర్మ స్థానాన్ని ఎలా భర్తీ చేయాలనే విషయం మీద మల్లగుల్లాలు పడుతోంది.

పృథ్వీ షా డౌట్..
ఇదివరకు టెస్ట్ మ్యాచుల్లో జట్టు ఇన్నింగ్ను ఆరంభించిన పృథ్వీ షా ప్రస్తుతం.. ఏ మాత్రం ఫామ్లో ఉండట్లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో మూడుసార్లు డకౌట్ అయిన అతను.. తన ఆటతీరును ఏ మాత్రం మెరుగుపర్చుకోలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా-ఏ టీమ్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లోనూ ఓ ఇన్నింగ్లో సున్నాకే అవుట్ అయ్యాడు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయాడు. మిగిలిన ఇన్నింగ్లల్లోనూ భారీ స్కోరును నమోదు చేయలేకపోయాడు. టీమిండియా మేనేజ్మెంట్ నమ్మకాన్ని కోల్పోయాడతను ఈ పరిస్థితుల్లో పృథ్వీ షాను ఓపెనర్గా పంపించడం అనుమానమే.

శుభ్మన్కు ఛాన్స్?
మరో యంగ్ క్రికెటర్ శుభ్మన్ గిల్పై ఆశలు పెట్టుకుంది టీమిండియా. అతణ్ని ఓపెనర్గా ఆడించాలని భావిస్తోంది. ఓపెనర్గా ఆడిన అనుభవం శుభ్మన్కు ఉంది. ఐపీఎల్ టోర్నీల్లో కోల్కత నైట్ రైడర్స్ తరఫున జట్టును ఆరంభించాడతను. ఇదివరకు రంజీ టోర్నమెంట్లలోనూ ఓపెనర్గా బరిలో దిగిన సందర్భాలు ఉన్నాయి. కొత్త బంతిని ఎదుర్కొని, క్రీజ్లో పాతుకుని పోయే సామర్థ్యం శుభ్మన్కు ఉందని అంచనా వేస్తోంది టీమిండియా మేనేజ్మెంట్.

కీపర్ ఎవరు?
భారత క్రికెట్ జట్టు ఎదుర్కొనే మరో సమస్య వికెట్ కీపర్.. ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. టెస్టుల్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ముద్రపడిన వృద్ధిమాన్ సాహాను తుది జట్టులోకి తీసుకోవచ్చని అంటున్నారు. ఐపీఎల్-2020 సీజన్లోనూ సాహా అద్భుతంగా ఆడాడు. బౌలర్ల మీద ఆధిపత్యాన్ని చలాయించాడు. టెస్టల స్పెషలిస్ట్గా అతని పేరుంది. ఆస్ట్రేలియా-ఏ టీమ్పైనా భారీ స్కోరును నమోదు చేశాడు. వికెట్ వెనకల చురుగ్గా కదలగలడు. దీనితో తొలి టెస్ట్ మ్యాచ్లో వృద్ధిమాన్ సాహాను తుది జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

హనుమ విహారీకి మళ్లీ బెంచ్కే
తెలుగు క్రికెటర్ హనుమ విహారికి తొలి టెస్ట్ మ్యాచ్లో ఆడే అవకాశం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. జట్టు ఇప్పటికే సమతౌల్యంతో నిండిపోవడం వల్ల అతణ్ని ఆడిస్తారా? లేదా? అనేది అనుమానమే. హనుమ విహారిని తుదిజట్టులోకి తీసుకుంటే.. సమతౌల్యం దెబ్బతింటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అదనంగా మరో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ను తీసుకోవాలనుకుంటే.. టీమిండియా మేనేజ్మెంట్ ముందున్న ప్రత్యామ్నాయం విహారి ఒక్కడే. లేదా అయిదుమంది బౌలర్లను ఆడించాలనుకుంటే మాత్రం అతనికి అవకాశం దక్కకపోవచ్చు.

టెస్ట్ మ్యాచ్ల షెడ్యూల ఇదీ..
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మొత్తం నాలుగు టెస్ట్ మ్యాచ్లను నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు కొనసాగుతుంది. అనంతరం బాక్సింగ్ డే టెస్ట్.. ఈ నెల 26న ఆరంభమౌతుంది. దీనికి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదిక. జనవరి 7 నుంచి 11 వరకు మూడో టెస్ట్ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో సాగుతుంది. చివరి టెస్ట్.. బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో నిర్వహిస్తారు. దీనితో భారత క్రికెట్ జట్టు రెండున్నర నెలల ఆస్ట్రేలియా పర్యటన ముగుస్తుంది. ఆ వెంటనే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు.. భారత పర్యటనకు రానుంది.












Click it and Unblock the Notifications