లక్నోలో పోలీసుల కాల్పులు.. ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు...
పౌరసత్వ సవరణ చట్టం అగ్గిరాజేసింది. బిల్లుకు సవరణలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంగళూరులో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోగా.. లక్నోలో జరిగిన ఫైరింగ్లో ఒకరు చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డ వారు పోలీసుల కాల్పులతో గాయాలపాలయ్యారనే అంశంపై స్పష్టత రాలేదు.
లక్నోలో గురువారం ఉదయం నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సంబ జిల్లాలో ఆందోళనకారులు బస్సులను తగలబెట్టారు. లక్నోలో పోలీసు వాహనానికి కూడా నిప్పుపెట్టారు. లక్నోలోని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం సమీపంలోని పరివర్తన్ చౌక్ మూసివేశారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో మీడియా వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. మరోవైపు కేడీ సింగ్ మెట్రో స్టేషన్ గేట్లను కూడా అధికారులు మూసివేశారు.
ఇటు మరోవైపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా ఆందోళనకారులు భారీగా గుమికూడారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఆందోళనతో ఎర్రకోట, మండీ హౌస్, ఇతర సున్నిత ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరోవైపు మండీ హౌస్ నుంచి జంతర్ మంతర్ వెళ్లి ఆందోళన చేసేందుకు కమ్యునిస్టులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. మథుర రోడ్-కలిండీ కంజ్ రహదారులను మూసివేస్తున్నట్టు పోలీసులు ముందుగానే ప్రకటించారు. వాహనదారులు ఢిల్లీ రావాలంటే నోయిడా నుంచి డీఎండీ ఫ్లై ఓవర్ మీదుగా అక్షర్ ధామ్ రహదారి మీదుగా రావాలని సూచించారు. ఆందోళనల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా ఢిల్లీలో 19 మెట్రో స్టేషన్లను మూసివేశారు.