ఢిల్లీలో ఓమిక్రాన్ కల్లోలం-ఎయిర్ పోర్టులో ప్రతీ ఐదుగురిలో ఒకరికి వైరస్-తీవ్ర భయాందోళనలు
భారత్ లో ఓమిక్రాన్ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. నిన్న బిల్ గేట్స్ చెప్పినట్లు ఓమిక్రాన్ ఇతర వైరస్ ల కంటే మూడు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతుందనే విషయం భారత్ లో నిర్దారణ అవుతోంది. ఒక్క ఢిల్లీ ఎయిర్ పోర్టులో నిర్వహిస్తున్న కోవిడ్ పరీక్షల్లోనే ప్రతీ ఐదుగురిలో ఒకరికి ఓమిక్రాన్ వైరస్ బయటపడుతోంది. దీంతో ఢిల్లీ సర్కార్ తో పాటు కేంద్రంలోనూ ఆందోళన పెరుగుతోంది.
ఒమిక్రాన్ ముప్పు దృష్ట్యా కొన్ని రోజులుగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ (ఐజీఐబీ) కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఓమిక్రాన్ వైరస్ వ్యాప్తిని గుర్తించేందుకు జీనోమ్ పరీక్షలు నిర్వహిస్తున్న ల్యాబ్ లలో ఐజీఐబీయే అతి పెద్దది. ప్రతీ రోజూ 15 నుంచి 20 శాంపిల్స్ కు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నామని, ఇందులో 20 శాతం శాంపిల్స్ ఓమిక్రాన్ వైరస్ సోకినట్లుగా తేలుతున్నట్లు ల్యాబ్ కు చెందిన ఓ సీనియర్ శాస్త్రవేత్త వెల్లడించారు.
Recommended Video
డిసెంబర్ 2న ఢిల్లీలో తొలి ఓమిక్రాన్ కేసు బయటపడింది. టాంజానియా నుంచి వచ్చిన ఓ 37 ఏళ్ల వ్యక్తికి వైరస్ గుర్తించారు. ఆ తర్వాత గత 20 రోజుల్లో ఈ సంఖ్య 57కు చేరుకుంది. గతంలో అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి మాత్రమే ఓమిక్రాన్ వైరస్ ఇతరులకు సోకుకుతుందని గుర్తించగా.. తాజాగా సామాజికంగా కూడా దేశంలోనూ వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తాజాగా 17 మంది రోగుల్ని ఓమిక్రాన్ వైరస్ కారణంగా ఆస్పత్రుల్లో చేర్చామని, వీరికి ఎలాంటి ప్రయాణాల చరిత్ర లేదని ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రి డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం దేశంలో నమోదైన ఓమిక్రాన్ కేసుల్లో రాజధాని ఢిల్లీలోనే 27 శాతం కేసులు తేలాయి. ఢిల్లీ తర్వాత స్ధానంలో ముంబై 30 కేసులతో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇవాళ రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కేంద్రం రాష్ట్రాల్ని ఓమిక్రాన్ ముప్పుపై అప్రమత్తం చేస్తోంది.