పేదలకు 10శాతం రిజర్వేషన్ బిల్లు: సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన యూత్ ఫర్ ఈక్విటీ
న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ బిల్లు సుప్రీం కోర్టుకు చేరింది. జనరల్ కేటగిరీలో పేదలకు రిజర్వేషన్లు ఇస్తూ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. యూత్ ఫర్ ఈక్విటీ అనే సంస్థ, కౌషల్ కాంత్ మిశ్రాలు పిటిషన్ దాఖలు చేశారు.
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్రం తీసుకు వచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి సంతకం పెడితే ఈ బిల్లు చట్ట రూపం దాల్చుతుంది.

ఇలాంటి సమయంలో ఈ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈ బిల్లు వల్ల దేశంలో రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు.
కాగా, విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 124 రాజ్యాంగ సవరణ బిల్లుకు రెండు రోజుల్లో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. మంగళవారం లోకసభలో ఆమోదం పొందగా, బుధవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కొందరు అభిప్రాయపడినా చివరకు ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి అందరూ అనుకూలంగా ఓటు వేశారు.












Click it and Unblock the Notifications