కర్ణాటకలో 20 మంది మంత్రులు: డేట్ ఫిక్స్, దేవేగౌడ గ్నీన్ సిగ్నల్, అసమ్మతి ఎమ్మెల్యేలు, బీజేపీ!
బెంగళూరు: కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి సిద్దం అవుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మంత్రి వర్గంలో 20 మంది కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. మంత్రి వర్గ విస్తరణకు శుక్రవారం మాజీ ప్రధాని దేవేగౌడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసమ్మతి ఎమ్మెల్యేలను గుర్తించిన తరువాత వారికి నచ్చచెప్పి పూర్తి మంత్రి వర్గ విస్తరణ చెయ్యాలని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నేతలు నిర్ణయించారు.
మాజీ ప్రధాని ఓకే
శుక్రవారం మద్యాహ్నం 12 గంటలకు బెంగళూరు నగరంలోని మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్.డి. దేవేగౌడ ఇంటిలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్ భేటీ అయ్యి సుదీర్ఘంగా చర్చించారు.
అసమ్మతి నేతలు
ఒకే సారి పూర్తి మంత్రి వర్గం ఏర్పాటు చేస్తే లేనిపోని సమస్యలు ఇప్పుడే ఎదురౌతాయని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవులు రాలేదనే కోపంతో ఎక్కడ బీజేపీ వైపు అసమ్మతి ఎమ్మెల్యేలు వెళ్లిపోతారో అనే ఆందోళన జేడీఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల్లో మొదలైయ్యింది.
కాంగ్రెస్ 12, జేడీఎస్ 8
శనివారం కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి సిద్దం అయ్యారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఇరు పార్టీల నాయకులు ఏశాఖలు ఎవరికి కేటాయించారో అధికారికంగా ప్రకటిస్తామని మీడియాకు చెప్పారు.
జేడీఎస్, కాంగ్రెస్ శాఖలు
ఆర్థిక, విద్యుత్, పీడబ్ల్యూ, సహకార, ఎక్సైజ్ తో పాటు 8 శాఖలు జేడీఎస్ పార్టీ నాయకులు తీసుకుంటున్నారు. హోం శాఖ, రెవెన్యూ, ఆరోగ్య, బెంగళూరు నగరాభివృద్ది, పంచాయితీ రాజ్, జనవనరులు నీటి పారుదల, గృహ నిర్మాణ, గనులు, వ్యవసాయ, సాంఘిక సంక్షేమం తదితర శాఖలు కాంగ్రెస్ కు అప్పగిస్తున్నారు.
డీకే శివకుమార్ పరిస్థితి !
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ కు ఏ శాఖ అప్పగిస్తారో అనే చర్చ మొదలైయ్యింది. కర్ణాటకలో మూడు రోజుల్లో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణం అయ్యి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కారణం అయిన డీకే. శివకుమార్ సిద్దరామయ్య ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేశారు. ఇప్పుడు విద్యుత్ శాఖ జేడీఎస్ కి ఇచ్చారు. డీకే. శివకుమార్ కు ఏ శాఖ కేటాయిస్తారో అనే విషయం ఇంకా వెలుగు చూడలేదు.
కాంగ్రెస్ లీడర్స్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామలింగా రెడ్డి, దినేష్ గుండురావ్, ఎంబి. పాటిల్, కేజే జార్జ్, కృష్ణభైరే గౌడ, జమీర్ అహమ్మద్ ఖాన్, డాక్టర్ కె. సుధాకర్, కేంద్ర మాజీ మంత్రి కేహెచ్. మునియప్ప కుమార్తె, మొదటి సారి ఎమ్మెల్యే అయిన రూపా శశిధర్, ఎ. కృష్ణప్ప తదితరులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి సిద్దం అయ్యారు. అయితే జేడీఎస్ మీద తిరుగుబాటు చేసి కాంగ్రెస్ లో చేరిన జమీర్ అహమ్మద్ ఖాన్ కు మాజీ ప్రధాని దేవేగౌడ చాన్స్ ఇచ్చే అవకాశం లేదని సమాచారం.
కుమారస్వామి మార్కు
జేడీఎస్ పార్టీకి చెందిన కుమారస్వామి ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక సీఎం కుమారస్వామి సోదరుడు, మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ, మండ్య జిల్లా మేలుకోటే ఎమ్మెల్యే సీఎస్. పుట్టరాజు, చాముండేశ్వరి నియోజక వర్గంలో సిద్దరామయ్యను చిత్తుచిత్తుగా ఓడించిన జీటీ. దేవేగౌడ, మైసూరులోని కేఆర్ నగర్ ఎమ్మెల్యే సా.రా. మహేష్, జూన్ 11వ తేదీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఎం. ఫారుక్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు.