ఆరేళ్ల బాలిక మిస్సింగ్: మృతదేహం..అర్ధనగ్నంగా: 12 ఏళ్ల పక్కింటి బాలుడి అరెస్ట్: సీసీ కెమెరాలో
చండీగఢ్: చండీగఢ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండు రోజుల కిందట కనిపించకుండా పోయిన ఆరేళ్ల బాలిక.. నిర్జీవంగా కనిపించింది. రోడ్డు పక్కన పొదల్లో అర్ధనగ్న స్థితిలో బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆ బాలిక ఇంటి పక్కనే నివసిస్తోన్న ఓ 12 ఏళ్ల కుర్రాడిని నిందితుడిగా గుర్తించారు. అతణ్ని అరెస్ట్ చేశారు.

ఇంటి ముందు ఆడుకుంటూ.. అదృశ్యం..
చండీగఢ్లోని హల్లో మాజ్రా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి ఆ బాలిక కనిపించకుండా పోయింది. చివరిసారిగా సాయంత్రం 4 గంటలకు చివరిసారిగా ఆమెను చూసినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత- ట్యూషన్కు వెళ్లి ఉండొచ్చని భావించారు. అక్కడ విచారించగా.. ట్యూషన్కు వెళ్లలేదని తెలిసింది. దీనితో అదే రోజు సాయంత్రం బాలిక తల్లిదండ్రులు సెక్టార్ 31 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక కోసం అన్ని చోట్లా గాలించారు. సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేసినప్పటికీ.. ఆచూకీ కనిపించలేదు.

రోడ్డు పక్కన పొదల్లో అర్ధనగ్న స్థితిలో మృతదేహం..
మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయంలో బాలిక మృతదేహమై కనిపించింది. హల్లో మాజ్రా ప్రాంతంలో చండీగఢ్-అంబాలా రహదారి పక్కన చెట్ల పొదల్లో బాలిక మృతదేహాన్ని తొలుత స్థానికులు గుర్తించారు. కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు. సెక్టార్ 31 పోలీస్ స్టేషన్లో బాలిక మిస్సింగ్ కేసు నమోదై ఉండటంతో అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. అర్ధనగ్న స్థితిలో బాలిక మృతదేహం కనిపించింది. తలపై బండరాళ్లతో మోది హత్య చేసినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని చండీగఢ్లోని ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు.

సైకిల్పై ఎక్కించుకుని..
మిస్సింగ్ కేసును హత్యగా బదలాయించిన అనంతరం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నగర వ్యాప్తంగా అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ బాలిక పక్కింట్లో నివసించే 12 ఏళ్ల బలుడు ఆమెను సైకిల్పై ఎక్కించుకుని హల్లో మాజ్రా వైపు వెళ్తోన్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వాటి ఆధారంగా అతణ్ని అరెస్ట్ చేశారు. బాలికపై అత్యాచారం చేశాడా? లేదా? అనేది ఇంకా తెలియరాలేదని, పోస్ట్మార్టమ్ నివేదిక అందిన తరువాతే..మరిన్ని కీలక విషయాలు తెలుస్తాయని చండీగఢ్ పోలీస్ సూపరింటెండెంట్ కుల్దీప్ సింగ్ చాహల్ తెలిపారు. బండరాయితో తలపై మోదడం వల్ల తీవ్ర రక్తస్రావమై బాలిక మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని అన్నారు.

జువైనల్ హోమ్కు
నిందితుడిని అరెస్ట్ చేసి, జువైనల్ హోమ్కు తరలించినట్లు కుల్దీప్ సింగ్ తెలిపారు. అతనిపై కిడ్నాప్, హత్య కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళనకు దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి వద్ద బైఠాయించారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పక్కా సాక్ష్యాధారాలతో నిందితుడు దొరికినందున నేరుగా అతనికి శిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు. చండీగఢ్ ఎస్పీ వారిని శాంతింపజేశారు.












Click it and Unblock the Notifications