ట్రంప్ టూర్ ఏర్పాట్లలో నిమగ్నమైన వేళ.. గుజరాత్లో మళ్లీ మత ఘర్షణలు
అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు, స్వాగత ఏర్పాట్లలో నిమగ్నమైన గుజరాత్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మరోసారి మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గుజరాత్ ఆర్థిక రాజధాని అహ్మదాబాద్కు ఆనుకునే ఉన్న ఆనంద్ జిల్లాలో ఈ ఘటనలు సంభవించాయి. నెలరోజుల వ్యవధిలో ఈ మత ఘర్షణలు చోటు చేసుకోవడం ఇది రెండోసారి కావడం, ట్రంప్ దంపతుల పర్యటనకు కొన్ని గంటల ముందు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అహ్మదాబాద్ సమీప జిల్లాలో..
ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఈ దాడులు, ప్రతి దాడుల్లో ఆస్తినష్టం భారీగా సంభవించింది. ఆనంద్ జిల్లాలోని ఖంభట్ ప్రాంతాలో ఆదివారం సాయంత్రం వాగ్వివాదంతో ఆరంభమైన ఈ ఘటన.. దాడులు, ప్రతిదాడులకు దారి తీసినట్లు పోలీసులు వెల్లడించారు. ఒక వర్గం వారు మరో వర్గానికి చెందిన నివాసాలు, దుకాణాలపై దాడులు చేశారు. రాళ్లు రువ్వారు. వాహనాలకు నిప్పంటించారు.

తరచూ మత కలహాలు..
జనవరి 24వ తేదీన చోటు చేసుకున్న దాడులకు ప్రతీకారంగా మరో వర్గం వారు తాజాగా ఈ ప్రతిదాడికి దిగినట్లు ఆనంద్ జిల్లా పోలీసులు చెబుతున్నారు. ఖంబట్ అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతమని, పలుమార్లు మత ఘర్షణలకు వేదికగా మారిన సందర్భాలు ఉన్నాయని ఆనంద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ దివ్య మిశ్రా తెలిపారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పెద్ద అదనపు పోలీసు బలగాలను సంఘటనా స్థలానికి పంపించినట్లు చెప్పారు.
Recommended Video


46 మందిని అరెస్టు..
మత ఘర్షణలకు దిగిన 46 మందిని అదుపులోకి తీసుకున్నట్లు దివ్య మిశ్రా వెల్లడించారు. ఖంబట్, అక్బర్ పురాలల్లో వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఖంబట్లో 20, అక్బర్ పురాలో 25 నివాసాలు ధ్వంసమైనట్లు గుర్తించామని తెలిపారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారని అన్నారు. ఈ దాడులు పలువురు గాయపడ్డారని, వారికి ఆసుపత్రులకు తరలించామని, వారిలో కొందరు డిశ్చార్జి అయ్యారని చెప్పారు. ఈ రెండు చోట్ల 100మందికి పైగా పోలీసులను మోహరింపజేశామని అన్నారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నట్లు దివ్య మిశ్రా చెప్పారు.












Click it and Unblock the Notifications