ప్రేమించలేదని బాలిక తల, మొండెం వేరుచేశాడు, మద్యం మత్తులో కిరాతకం!
సేలం(తమిళనాడు): ప్రేమించడానికి నిరాకరించిందని ఆవేశంలో బాలికను అతికిరాతకంగా హత్య చేసిన ఘటన తమిళనాడులోని సేలం సమీపంలో జరిగింది. 8వ తరగతి విద్యార్థిని అతి దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
సేలం సమీపంలోని తెరికుకాడు గ్రామంలో నివాసం ఉంటున్న రాజ్యలక్ష్మి (13) అనే బాలిక సమీపంలోని పాఠశాలలో 8వ తరగతి విద్యాభ్యాసం చేస్తున్నది. రాజ్యలక్ష్మి ఇంటి సమీపంలో దినేష్ కుమార్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.
దినేష్ కుమార్ కొంత కాలంగా నిన్ను ప్రేమిస్తున్నానని రాజ్యలక్ష్మి వెంటపడుతున్నాడు. రాజ్యలక్ష్మి పాఠశాలకు వెళ్లి వస్తున్న సమయంలో ఆమెను వేధింపులకు గురి చేశాడు. దినేష్ కుమార్ వేధింపులు ఎక్కువ కావడంతో రాజ్యలక్ష్మి కొన్ని రోజుల నుంచి ఇంటికే పరిమితం అయ్యింది.
పీకలదాక మద్యం సేవించిన దినేష్ కుమార్ రాజ్యలక్ష్మి ఒక్కటే ఇంటిలో ఉందని తెలుసుకున్నాడు. ఇంటిలో చొరబడిన దినేష్ కుమార్ కుమార్ రాజ్యలక్ష్మి మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. రాజ్యలక్ష్మి గట్టిగా కేకలు వేసింది.
ఇరుగు పొరుగు వారు వస్తారని భయంతో పదునైన కత్తి తీసుకున్న దినేష్ కుమార్ రాజ్యలక్ష్మి తల, మొండెం వేరు చేసి కిరాతకంగా హత్య చేశాడు. రాజ్యలక్ష్మి తలను బయటకు విసిరివేసి అక్కడి నుంచి పరారైనాడు. రాజ్యలక్ష్మి తల్లి ఇంటికి చేరకుని విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన దినేష్ కుమార్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.