Coronavirus భయం: హంపీలో 144 సెక్షన్, ఫేస్ బుక్ లో పుకార్లు, దెబ్బకు జైల్లో చిప్పకూడు, క్లోజ్!
బెంగళూరు/ హంపి/ మైసూరు: కరోనా వైరస్ వ్యాధి (COVID 19) దెబ్బకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పర్యాటక కేంద్రం హంపీపై పడింది. ప్రతినిత్యం విదేశీ పర్యాటకులతో కిటకిటలాడే హంపి నేడు బోసిపోయింది. హంపీలో పర్యాటకులకు ఆంక్షలు విధించారు. హంపీలో 144 సెక్షన్ అమలు చేశారు. కరోనా వైరస్ వ్యాధిపై ఫేస్ బుక్ లో, సోషల్ మీడియాలో తప్పుడు పుకార్లు సృష్టించి, మా ప్రాంతాల్లో ఇద్దరికి కరోనా వైరస్ సోకిందని, ఈ దెబ్బతో మీ కథ క్లోజ్ అంటూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఇద్దరు ఆకతాయిలను పోలీసులు అరెస్టు చెయ్యడంతో జైల్లో చిప్పకూడు తింటున్నారు.
Coronavirus Patient:బెంగళూరులో ఇన్ఫోసిస్ భవనం ఖాళీ, ఉద్యోగుల క్షేమం!
ఏ పరిస్థితి వస్తుందో!
హంపీలో కరోనా వైరస్ అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకుంటున్నామని బళ్లారి జిల్లాధికారి (కలెక్టర్) ఎస్ఎస్. నకుల్ చెప్పారు. శనివారం బళ్లారిలో జిల్లా కలెక్టర్ ఎస్ఎస్. నకుల్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాధి వ్యాపించకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించిందని జిల్లా కలెక్టర్ ఎస్ఎస్. నకుల్ అన్నారు.
ఆలయంలో పూజలు మాత్రమే !
హంపీలోని శ్రీ విరుపాక్షేశ్వర దేవాలయంలో స్థానికులు పూజలు చెయ్యడానికి మాత్రమే తాము అవకాశం ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ఎస్. నకుల్ స్పష్టం చేశారు. పూజలు, హోమాలు చెయ్యడానికి తాము ఎలాంటి ఆంక్షలు విధించలేదని జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ నకుల్ చెప్పారు.
హంపీ చూడటానికి నో చాన్స్
కరోనా వైరస్ వ్యాధి అరికట్టడానికి హంపీలోని పర్యాటక ప్రాంతాలు చూడటానికి తాము అవకాశం ఇవ్వలేదని, పర్యాటకులు పూర్తిగా సహకరించాలని జిల్లా కలెక్టర్ మనవి చేశారు. అంతే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు రద్దు చేశామని, ముఖ్యంగా హంపీలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి తాము అవకాశం ఇవ్వలేదని జిల్లా అన్నారు.
10 మందికి కరోనా పరీక్షలు
హంపీతో పాటు బళ్లారి జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధి సోకిందనే అనుమానంతో 10 మందికి పరీక్షలు నిర్వహించామని, ఎవ్వరికీ ఆ వ్యాధి వ్యాపించలేదని వెలుగు చూసిందని, ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని జిల్లా కలెక్టర్ ఎస్ఎస్. నకుల్ అన్నారు. కరోనా వైరస్ వ్యాధిని అరికట్టడానికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం హంపీతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశామని, ముగ్గురి కంటే ఎక్కువ మంది గుమికూడరాదని జిల్లా కలెక్టర్ ఎస్ఎస్. నకుల్ తెలిపారు.
సోషల్ మీడియాలో పుకార్లు, జైల్లో చిప్పకూడు
కర్ణాటకలోని మైసూరు సమీపంలోని గుండ్లుపేటలోని పురుషుడికి, చామరాజనగర జిల్లాలోని నంజనగూడులో ఓ మహిళకు కరోనా వైరస్ వ్యాపించిందని ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూప్ తో పాటు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. విషయం గుర్తించిన నెటిజన్లు పోలీసులు జిల్లా కలెక్టర్ తో పాటు పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చామరాజనగరలో నివాసం ఉంటున్న నాగేంద్ర, కాపుదవాడి ప్రాంతానికి చెందిన లోకేష్ అనే ఇద్దరు తప్పుడు ప్రచారం చేశారని గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపించామని పోలీసు అధికారులు తెలిపారు.