మరో ఊరట- దోహాలో చిక్కుకున్న 146 మంది భారతీయులు వెనక్కి-ఆప్ఘన్ సంక్షోభం నేపథ్యం
ఆప్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తరలించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తున్నాయి. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్ నుంచి నేరుగా దౌత్యవేత్తల్ని, ఇతర సిబ్బందిని భారత్ తరలించిన కేంద్రం.. ఇప్పుడు అక్కడి పౌరుల్ని నేరుగా భారత్ కు రప్పించకుండా విదేశాలకు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి తీసుకొస్తోంది.
ఇలా ఆప్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో కాబూల్ నుంచి ఖతార్ రాజధాని దోహాకు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న 146 మంది భారతీయుల్ని కేంద్రం.. క్షేమంగా ఇవాళ స్వదేశానికి తీసుకొచ్చింది. ఆప్గన్ లో ఉన్న భారతీయులతో పాటు ఇతర దేశాల ప్రజల్ని అమెరికాతో పాటు నాటో దళాలు వివిధ దేశాలకు తరలిస్తున్నాయి. అక్కడి నుంచి ఆయా దేశాలు తమ పౌరుల్ని స్వదేశానికి తరలిస్తున్నాయి. దీంతో ఆప్ఘన్ లో చిక్కిన విదేశీ పౌరులకు ఊరట లభిస్తోంది. ఇదే కోవలో ఆప్ఘనిస్తాన్ లో చిక్కుకున్న ఈ 146 మందిని అమెరికా, నాటో దళాలు ఖతార్ రాజధాని దోహాకు తరలించాయి. అక్కడి నుంచి భారత్ పంపిన ప్రత్యేక విమానాల్లో వీరు ఇవాళ భారత్ చేరుకున్నారు.

నిన్న 135 మంది భారతీయుల్ని ఇదే కోవలో దోహా నుంచి భారత్ కు తీసుకొచ్చారు. ఇవాళ మరో 146 మంది క్షేమంగా స్వదేశానికి చేరారు. దీంతో మొత్తం 281 మందిని దోహా నుంచి భారత్ తెచ్చినట్లయింది. ఇవాళ వచ్చిన 146 మందిలో 104 మంది విస్తారా ఎయిర్ లైన్స్ ఫ్లైట్ లోనూ, మరో 30 మంది ఖతర్ ఎయిర్ వేస్ విమానంలోనూ, ఇంకో 11 మంది ఇండిగో విమానంలోనూ స్వదేశానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఆప్ఘనిస్తాన్ లో విదేశీ సంస్ధల తరఫున పనిచేస్తున్న ఉద్యోగులేనని వారు వెల్లడించారు. అందుకే వీరిని అమెరికా, నాటో దళాలు రక్షించి దోహాకు పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ ఆగస్టు 22న 392 మంది దౌత్య సిబ్బందితో పాటు ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వ ప్రజాప్రతినిధుల్ని సైతం భారత్ కు సురక్షితంగా తీసుకొచ్చింది.












Click it and Unblock the Notifications