రాజస్థాన్ మంత్రివర్గంలోకి 15 కొత్త ముఖాలు, ఐదుగురు సచిన్ పైలట్ వర్గం, అంతా ఓకే
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంత్రివర్గంలోకి కొత్త ముఖాలు వచ్చాయి. మొత్తం 15 మంది మంత్రివర్గంలోకి వచ్చారు. వీరిలో ఐదుగురు సచిన్ పైలట్ వర్గం వారు కావడం గమనార్హం. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు ఆదివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఉన్న బేదాభిప్రాయాలకు ఈ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చరమగీతం పాడినట్లుగా తెలుస్తోంది. మొత్తం 30 మందిలో తాజాగా 15 మంది కొత్తగా మంత్రులైన వారే ఉండటం గమనార్హం. పార్టీలో ఉన్న విభేదాలకు చెక్ పెట్టేలా ఈ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు.
గత ఏడాది సచిన్ పైలట్.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నాయకత్వాన్ని అంగీకరించని విషయం తెలిసిందే. అంతేగాక, పార్టీ రెండు వర్గాలు చీల్చేయత్నం చేశారు. అయితే, పార్టీ అధిష్టానం రంగంలోకి దిగడంతో తాను పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. తాజాగా, రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, తామంతా కలిసి పనిచేస్తున్నామని సచిన్ పైలట్ చెప్పారు.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో కలిసి పనిచేసేందుకు తాము సుముఖంగా ఉన్నామని, తమ మధ్య ఇప్పుడు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు సచిన్ పైలట్. గాంధీల నాయకత్వంలో తామంతా పనిచేస్తామని చెప్పుకొచ్చారు. 2023 ఎన్నికల్లో బీజేపీతో పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని, గిరిజనులు, దళితులు, మహిళలతో సహా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడమే తాజా చర్య అని సచిన్ పైలట్ వివరించారు.
Recommended Video
కాగా, ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన జాబితా ప్రకారం హేమరామ్ చౌదరి, మహేంద్రజిత్ మాల్వియా, రాంలాల్ జాట్, మహేశ్ జోషి, విశ్వేంద్ర సింగ్, రమేశ్ మీనా, మమతా భూపేష్, భజన్లాల్ జాతవ్, టికారమ్ జూలీ, గోవింద్ రామ్ మేఘ్వాల్, శకుంతలా రావత్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు జాహిదా ఖాన్, బ్రిజేంద్ర ఓలా, రాజేంద్ర గూడా, మురారీలాల్ మీనా రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో మమతా భూపేష్, భజన్లాల్ జాతవ్, టికారమ్ జూలీ ప్రస్తుతం రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. పదోన్నతి పొంది కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ జాబితాలో హేమారం చౌదరి, మురారీలాల్ మీనా, బ్రిజేంద్ర ఓలా సహా ఐదుగురు ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ వర్గానికి చెందినవారు కావడం విశేషం. ఇది కాకుండా, గత ఏడాది ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు వైఖరిని తీసుకున్న సమయంలో పైలట్తో పాటు పదవి నుండి తొలగించబడిన విశ్వేంద్ర సింగ్, రమేష్ మీనాలను తిరిగి మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు.