లోకసభలో మోడీ తొలి అడుగు, సోనియాకి నమస్కరించి
న్యూఢిల్లీ: పదహారవ లోకసభ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్గా ఉన్న కమల్ నాథ్ వ్యవహరించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోపినాథ్ ముండేకు లోకసభ నివాళులు అర్పించింది. సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి పార్లమెంటుకు హాజరయ్యారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించక ముందు లోకసభకు గతంలో ఎప్పుడు ప్రాతినిథ్యం వహించలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు చేశారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీని బిజెపి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది.
ఎన్నికల్లో బిజెపి గెలిచాక ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. గత నెలలో ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం లోకసభకు హాజరయ్యారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా సభకు హాజరయ్యారు. లోకసభలో తనకు ఎదురుపడిన సోనియాకు ప్రధాని మోడీ నమస్కరించి... పలకరించారు. మోడీకి సోనియా, ములాయం సహా అన్ని పార్టీల నేతలు అభినందనలు తెలిపారు.
అంతకుముందు ప్రొటెం స్పీకర్గా లోకసభలో అత్యంత సీనియర్ సభ్యుడైన కమల్ నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు.