ఆర్ టీసీ సమ్మె: 17 వేల బస్సులు, ఆంధ్రా సర్వీసులు, అడవిలో వదిలేశారు!
Recommended Video

చెన్నై: తమిళనాడులో టీఎన్ ఆర్ టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రయాణికులు నానా ఇబ్బందులకు గురైనారు. వేతనాల పెంపు, సమస్యల పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ 46 యూనియన్లకు చెందిన టీఎన్ ఆర్ టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. మార్గం మధ్యలో, అడువిలో బస్సులు నిలిపేసిన డ్రైవర్లు, కండెక్టర్లు వారి దారి వారు చూసుకోవడంతో ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు.

మార్గం మధ్యలో వదిలేశారు
తమిళనాడులో దాదాపు 25, 000 బస్సుల్లో 1.40 లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు. వాటిలో 17, 000 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మెకు అనేక కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వడంతో నీలగిరి, రామేశ్వరం, కన్యాకుమారి, ఊటీ, కోయంబత్తూరు, సేలం తదితర మార్గాల్లో ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్లు, కండెక్టర్లు రోడ్డు పక్కన వాహనాలు నిలిపివెయ్యడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

75 శాతం బస్సు సర్వీసులు !
కార్మికుల సమ్మెతో 75 శాతం పైగా టీఎన్ ఆర్ టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. బస్సులు నడవకపోవడంతో విద్యార్థులు, ప్రజలు, ఇతర రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడులోని పలు బస్టాండ్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.

ప్రైవేటుకు పండగే !
పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు వాహనాల యాజమాన్యాలు అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు బస్సులు, కార్లు, మిని క్యాబ్ లు నడుపుతున్నారు.

ఆంధ్రా బస్సు సర్వీసులు
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, గూడూరు, కాళహస్తి, కుప్పం, పలమనేరు, మదనపల్లి, కడప, అనంతపురం, రాజంపేట తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ బస్సులను చెన్నైతో పాటు తమిళనాడులోని ఇతర ప్రాంతాలకు తరలించి తెలుగు ప్రజలను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.

కర్ణాటక, కేరళ
బెంగళూరు నుంచి చెన్నైతో పాటు సేలం, కోయంబత్తూరు, హోసూరు, క్రిష్ణగిరి, ధర్మపురి, వేలూరు తదితర ప్రాంతాలకు అధిక సంఖ్యలో బస్సులు నడుపుతున్నారు. ఇక కేరళ నుంచి తమిళనాడుకు అదనపు బస్సు సర్వీసులు నడుపుతున్నారు.

చర్చలకు రండి
ఆర్ టీసీ కార్మికులు వెంటనే విధులకు హాజరుకావాలని, చర్చలకు తాము సిద్దమని తమిళనాడు రవాణా శాఖ మంత్రి విజయ్ భాస్కర్ చెప్పారు. అయితే మా సమస్యలు పరిష్కరించిన తరువాతే మేము విధులకు హాజరు అవుతామని కార్మిక సంఘాల నాయకులు తేల్చి చెప్పారు.

పళని, పన్నీర్ తో భేటీ
ఆర్ టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొవడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విజయ్ భాస్కర్ భేటీ అయ్యి చర్చిస్తున్నారు.

కమల్ కౌంటర్
ఆర్ టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించి తమిళనాడు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొకుండా చూడాలని హీరో కమల్ హాసన్ మలేషియా నుంచి ట్విట్టర్ లో మనవి చేశారు. తమిళనాడు ప్రజలకు ఈ సంక్రాంతికి ఇచ్చే బహుమతి ఇదే కావాలని, కార్మికుల కష్టాలు తీర్చాలని కమల్ తనదైన శైలిలో తమిళంలో ట్వీట్ చేశారు.

హీరో విశాల్ !
ఆర్ టీసీ కార్మికుల సమ్మె కారణంగా తమిళనాడు ప్రజలు, ఇతర రాష్ట్రాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని హీరో విశాల్ సోషల్ మీడియాలో మనవి చేశారు. కార్మికులతో చర్చలకు ప్రభుత్వం సిద్దం కావాలని హీరో విశాల్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications