విదేశీ బాలిక రేప్: ఏపీలో ఆస్ట్రేలియా స్త్రీ అదృశ్యం కలకలం
పనాజీ/అనంతపురం: గోవాలో దారుణం జరిగింది. ఇస్టోనియాకు చెందిన టీనేజ్ బాలిక అత్యాచారానికి గురైంది. దీంతో బాధితురాలు అంజునా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుల పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.
నిందితుడు ముంబైకి చెందిన షమీమ్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. అత్యాచారం విషయం ఎవరికైనా వెల్లడిస్తే తల్లిదండ్రులను చంపేస్తామని నిందితుడు బెదిరించాడని సదరు ఇస్టోనియా బాధిత బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది.
అత్యాచారం అనంతరం యువతి వద్దనున్న సెల్ఫోన్, నగదు తీసుకొని నిందితుడు పరారయ్యాడని పోలీసులు తెలిపారు. గోవా రాజధాని పనాజీకి 20 కిలోమీటర్ల దూరంలో చపోరా గ్రామంలో ఈ అత్యాచార సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఉత్తర గోవాలోని చపోరా గ్రామం నేరాలు, మాదక ద్రవ్యాలకు నిలయమని పోలీసులు చెప్పారు.
పుట్టపర్తిలో ఆస్ట్రేలియా మహిళ అదృశ్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఆస్ట్రేలియా మహిళ ఒకరు అదృశ్యమయ్యారు. ఆస్ట్రేలియాకు చెందిన టోనీ బేరియల్ అనే మహిళ పుట్టపర్తిలోని సాయిగౌరీ అపార్టుమెంటులో నివాసం ఉన్నారు. టోనీ అదృశ్యమైందని వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
టోనీ సెప్టెంబర్ నెలలో పుట్టపర్తి వచ్చారు. బంధువులు కేసు పెట్టడంతో పోలీసులు నెల రోజులకు పైగా గాలిస్తున్నారు. అపార్టుమెంటుకు చెందిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. టోనీ అదృశ్యమైందా లేక హత్యకు గురైందా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
టైరు కాల్చిన ఇద్దరు మృతి
ఇండోర్లో బైకుపైకి ఓ ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఆర్టీవో ఇన్స్పెక్టర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన ఓ ట్రాక్టర్ ఆపలేదు. అందుకు ఆ ఇన్స్పెక్టర్ ఆ ట్రాక్టర్ టైరును తుపాకీతో కాల్చేశాడు. దీంతో అదుపు తప్పిన ట్రాక్టర్ రెండు బైకులపై దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మధ్యప్రదేశ్లోని రాంపూరియాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. చనిపోయిన వారి వివరాలు తెలియరాలేదు.
తల్లి, భార్యను కాల్చి చంపి.. నావికుడి ఆత్మహత్య
నావికుడొకరు తన తల్లిని, భార్యను కాల్చి చంపి, అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్ భరత్పూర్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. సెవార్ ప్రాంతంలో నివాసముంటున్న నవనీత్ తొలుత తల్లిని, ఆ తరువాత భార్యను కాల్చి చంపాడని, ఆపై అదే తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడని అదనపు ఎస్పీ భవానీ శంకర్ తెలిపారు.
సూసైడ్ నోట్ వదిలాడని, అయితే ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టిందీ అందులో పేర్కొనలేదని వివరించారు. హర్యానాలో తుపాకీని కొనుగోలు చేశానని మాత్రం ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లోనే అతనికి వివాహమైంది. కుటుంబతగాదాలే ఇందుకు కారణమని తమ ప్రాథమిక విచారణలో తేలిందని, అయితే పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.