ముంబైలో తొక్కిసలాట: 18 మంది దుర్మరణం
ఆధ్యాత్మిక గురువు మొహమ్మద్ బర్హుద్దీన్ శుక్రవారంనాడు మరణించడంతో అక్కడికి పెద్ద యెత్తున ప్రజలు చేరుకున్నారని అధికార వర్గాలు చెప్పారు. శనివారం తెల్లవారు జామున ఒంటి గంటన్నర సమయంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుందని బిఎంసి విపత్తుల నియంత్రణ అధికారులు, పోలీసులు చెప్పారు.
ప్రజల చివరి చూపు కోసం సైద్నా మృతదేహాన్ని నివాసం వద్ద ఉంచారు. ఈ సమయంలో సైఫీ మహల్ వద్దకు వేలాది మంది భక్తులు చేరుకున్నారు. అకస్మాత్తుగా తొక్కిసలాట చోటు చేసుకోవడానికి గల కారణమేమిటనేది తెలియడం లేదు.
17 మృతదేహాలను సైఫై ఆస్పత్రికి, ఒక మృతదేహాన్ని కుంబల్లా హిల్ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. గాయపడిన 20 మందికి చికిత్స చేసి వారిని డిశ్చార్జీ చేశారు. మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చినట్లు అధికారులు చెప్పారు.
దావూదీ బోహ్రా వర్గానికి చెందిన ఆధ్యాత్మిక గురువు సైద్నా మొహమ్మద్ బర్హుహిద్దీన్ గుండెపోటుతో శుక్రవారంనాడు మరణించారు. ఆయన వయస్సు 102 ఏళ్లు.