చైనా రణతంత్రం: 1962 నాటి యుద్ధానికి సీక్వెల్?: నాడూ గాల్వన్ నుంచి వెనక్కి: విరుచుకుపడటానికా?
న్యూఢిల్లీ: భారత్తో చైనా యుద్ధానికి సన్నాహాలు చేస్తోందా? దీనికి సంబంధించిన సంకేతాలను ఇప్పటికే భారత్కు పంపించిందా? గాల్వన్ వ్యాలీ నుంచి వెనక్కి వెళ్లడమే ఆ సంకేతమా? భారత్పై విరుచుకుని పడటానికే చైనా నాలుగు అడుగులు వెనక్కి వేసిందా? ప్రస్తుతం దేశ ప్రజలకు తొలిచేస్తోన్న సందేహాలు ఇవి. దీనికి కారణాలు లేకపోలేదు. 1962లో భారత్పై యుద్ధానికి దిగడానికి ముందు కూడా చైనా ఇలాగే ప్రవర్తించిందని చెబుతున్నారు. ఇదే గాల్వన్ వ్యాలీ నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకున్న చైనా.. సరిగ్గా మూడు నెల తరువాత భారత్తో యుద్ధానికి దిగింది.

1962లో ఏం జరిగింది?
భారత్ చైనా మధ్య 1962లో మొట్టమొదటిసారిగా యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. 1962 అక్టోబర్ 20వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధం సరిగ్గా నెలరోజుల పాటు కొనసాగింది. అదే ఏడాది నవంబర్ 21న ముగిసింది. నాటి యుద్ధంలో చైనా విజయం సాధించింది. లఢక్ సమీపంలోని అక్సాయ్ చిన్ సహా నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ప్రాంతంలో ఈ యుద్ధం కొనసాగింది. అప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలు తదనంతరం కీలకంగా మారాయి. కొంత భూభాగాన్ని భారత్ కోల్పోవాల్సి వచ్చిందనే విషయం ఒక తరానికి తెలిసిన వ్యవహారమే. ఈ యుద్ధానికి దిగడానికి ముందు కూడా చైనా గాల్వన్ వ్యాలీలో మోహరించిన సైన్యాన్ని ఉపసంహరించుకుంది.

1962 నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తుందా?
1962 యుద్ధానికి కూడా ప్రధాన కారణంగా మారింది ఇదే గాల్వన్ వ్యాలీ. ఈ ప్రాంతంపై పెత్తనం సాధించడానికి చైనా భారత్తో యుద్ధానికి దిగింది. అంతకుముందు- గాల్వన్ వ్యాలీ సమీపంలో 300 ట్రూపులను మోహరింపజేసింది. ఉన్నట్టుండి వాటిని వెనక్కి తీసుకుంది. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా బలగాలను ఉపసంహరించుకుంది.. ఇప్పట్లాగే. ఇప్పుడు కూడా అదే తరహా వాతావరణం సరిహద్దుల్లో నెలకొనడం, చడీ చప్పుడు లేకుండా బలగాలను చైనా వెనక్కి తీసుకోవడాన్ని బట్టి చూస్తోంటే.. 1962 నాటి సంప్రదాయాన్ని కొనసాగించే అవకాశాలు లేకపోలేదనే అంటున్నారు.

ఇదే జులై.. అదే గాల్వన్ వ్యాలీ పోస్ట్
1962లో చైనా ఇదే జులై నెలలో సరిహద్దుల నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. 1962 జులై 15వ తేదీన గాల్వన్ వ్యాలీ పోస్ట్ నుంచి ఉపసంహరించుకున్న చైనా.. ఆ తరువాత సరిగ్గా మూడు నెలలకు భారత్పై విరుచుకుని పడింది. 96 రోజుల తరువాత అంటే.. అక్టోబర్ 20వ తేదీన గాల్వన్ వ్యాలీ పోస్ట్ను ఓపెన్ చేసింది. భారత సైనికులపై యుద్ధానికి దిగింది. 36 మంది భారత సైనికులు అమరులు అయ్యారు. ఆర్మీ మేజర్ ఎస్ఎస్ హస్నబిస్ను యుద్ధఖైదీగా బంధించింది. ప్రిజనర్స్ ఆఫ్ వార్ క్యాంప్లో హస్నబిస్ ఏడునెలల పాటు గడిపారు.

భారత్ను అప్రమత్తం చేస్తోన్న చైనా చరిత్ర
ఇప్పుడు కూాడా అదే తరహా పరిస్థితులు నెలకొన్నాయనడంలో సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే- అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన.. అంతకుమించి సమస్యాత్మకమైన గాల్వన్ వ్యాలీ నుంచి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు వెనక్కి తగ్గాయి. ఉన్నపళంగా ఎందుకు తగ్గాయో ఎవరికీ తెలియదు. దాని వెనుక గల అసలు కారణమేంటనేదీ అంతుచిక్కట్లేదు. దీనిపై అటు కేంద్రం గానీ, ఇటు చైనా గానీ స్పష్టమైన వివరణలను ఇవ్వట్లేదు. చైనా బలగాలు వెనక్కి మళ్లడాన్ని భారత్..నైతిక విజయంగా భావిస్తోంది. అయినా రెప్పవాల్చకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.












Click it and Unblock the Notifications