ఇదేమీ చిన్న కేసు కాదు: సజ్జన్ కుమార్కు బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: 1984 సిక్కుల ఊచకోత కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఇది చిన్న కేసు కాదు.. సజ్జన్ కుమార్కు బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్ఫష్టం చేసింది.
కాగా, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సజ్జన్ కుమార్ వేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, వి రామసుబ్రహ్మణ్యంలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.
ఎలాంటి చికిత్స అవసరం లేదని రిపోర్టులు వెల్లడించాక.. అతడు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. వైద్య అవసరాలను చూపుతూ మాజీ ఎంపీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది.
Recommended Video
యావజ్జీవ శిక్షను రద్దు చేయాలనే అప్పీలును న్యాయస్థానాలు భౌతికంగా పనిచేసినప్పుడు పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసుల విచారణ చేపడుతోంది. ఇందిరా గాంధీ హత్యానంతరం సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో సజ్జన్ కుమార్ కీలక పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. ఈ అల్లర్లలో అనేకమందిని సిక్కులను హతమార్చిన విషయం తెలిసిందే.