ఈ నకిలీగాళ్లు కరోనా కంటే ప్రమాదం: ఫేక్ ‘రెమిడిసివిర్’ తయారు చేసి, రూ. 25వేలకు విక్రయం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి బారినపడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా.. కొందరు మానత్వం మరిచి రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. కరోనా రోగులను మరణం నుంచి కాపాడేందుకు ఉపయోగిస్తున్న రెమిడిసివిర్ ఇంజెక్షన్కు నకిలీలను సృష్టిస్తూ కరోనా మహమ్మారి కంటే ప్రమాదకరంగా మారుతున్నారు. తాజాగా, నకిలీగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.
నకిలీ రెమిడిసివిర్ ఇంజెక్షన్ల తయారీ..
గురువారం రాఘవపుర గ్రామంలో ఓ ఫ్యాక్టరీపై వడోదర క్రైమ్ బ్రాంచ్ డిటెక్షన్ టీం దాడి చేసింది. రెమిడిసివిర్ ఇంజెక్షన్కు నకీలను తయారు చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. ఆనంద్ జిల్లాకు చెందిన నిందితులు వివేక్ మహేశ్వర్(34), నయీమ్ వోరా(47)లను విచారిస్తున్నారు. అహ్మదాబాద్కు చెందిన మరో నిందితుడు నితేష్ జోషీ పరారీలో ఉన్నాడని, అతడే రెమిడిసివిర్ నకిలీలను తయారు చేసేందుకు మెటీరియల్ సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
28న ఐదుగురి అరెస్టుతో..
ఏప్రిల్ 28న రెమిడిసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వడోదర పోలీసులు తెలిపారు. వారి నుంచి 90 రెమిడిసివిర్ వయల్స్ స్వాధీనం చేసున్నట్లు చెప్పారు. నిందితులను విచారించగా.. వడోదరకు సమీపంలోని రాఘవపుర గ్రామంలో ఏర్పాటైన మహేశ్వర్ ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాలు తెలిశాయి. స్వాధీనం చేసుకున్న రెమిడిసివిర్ ఇంజెక్షన్లను హెటిరో ఫార్మాకు పంపగా.. అవి నకిలీగా తేల్చిందని పోలీస్ కమిషనర్ షంషేర్ సింగ్ వెల్లడించారు.
ఫ్యాక్టరీ పెట్టి నకిలీ రెమిడిసివిర్ ఇంజెక్షన్ల తయారీ
ఈ క్రమంలో గురువారం పోలీసులు ఆ ఫ్యాక్టరీపై దాడి చేసి 1200 టెర్రిఫిక్ ఎస్బీ డ్రగ్ వయల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిమోనియాకు ఉపయోగించే మందులనే రెమిడిసివిర్ ఇంజెక్షన్లుగా మారుస్తున్నారు. హెటిరో నుంచి వచ్చిన రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఎలా ఉంటుందో అలా ప్యాకేజీ చేసి విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు.
కాగా, ఇప్పటికే ఈ ముఠా 1160 ఫేక్ వయల్స్ ను విక్రయించాయని వెల్లడించారు. అరెస్టు చేసిన ఏడుగురిని కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులపై హత్యా నేరం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
అంతటా మోపయ్యారు ఈ నకిలీగాళ్లు
ఇది ఇలావుండగా, హరిద్వార్, రూర్కీ, కోటద్వార్ ప్రాంతాల్లో నకిలీ రెమిడిసివిర్ ఇంజెక్షన్ తయారు చేస్తున్న ముఠాలను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడితోపాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరు తయారు చేసిన నకిలీ రెమిడిసివిర్ ఇంజెక్షన్లను రూ. 25వేలకు ఒకటి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ ఇలాంటి నకిలీగాళ్లు దాపురించారు. పలు చోట్ల పోలీసులు వీరి అటకట్టించి కటకటాల వెనక్కి నెడుతున్నారు. అసలే మహమ్మారితో పోరాడుతుంటే.. ఈ నకిలీగాళ్లు కరోనా కంటే ప్రమాదకరంగా తయారయ్యారు. ఇలాంటివారిని కఠినంగా శిక్షించాలని, ఉరితీసినా పాపంలేదని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.