మమతకు సీబీఐ భారీ ఝలక్-ఇద్దరు మంత్రులు అరెస్ట్- నారదా స్టింగ్ కేసులో
పశ్చిమబెంగాల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్తో జయకేతనం ఎగరేసిన మమతా బెనర్జీకి సీబీఐ భారీ ఝలక్ ఇచ్చింది. ఎప్పుడో వదిలేసిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ మంత్రుల సహా నలుగురిని ఇవాళ కోల్కతాలో అరెస్టు చేసింది. దీంతో కేంద్రంలోని బీజేపీ మరోసారి మమతను టార్గెట్ చేస్తోందన్న చర్చ మొదలైంది.
ఇవాళ ఉదయం కోల్కతాలోని నిజాం ప్యాలెస్ సీబీఐ కార్యాలయానికి తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యే మదన్మిత్రా, మాజీ మంత్రి సోవన్ ఛటర్జీని తీసుకొచ్చారు. వీరిని కాసేపు ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. వీరిపై నారదా స్టింగ్ వీడియో కేసులో ఇవాళ సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయబోతోంది. మంత్రుల అరెస్టు సందర్భంగా కోల్కతాలోని వారి నివాసాల వద్ద ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకున్నాయి.
నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో మంత్రులు హకీమ్, సుబ్రతా ముఖర్జీని విచారించేందుకు బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ సీబీఐకి అనుమతి ఇచ్చారు. డబ్బులు తీసుకుంటూ కెమెరాలకు చిక్కిన పలువురు టీఎంసీ నేతలపై 2016లోనే కలకత్తా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు బీజేపీలో చేరిపోయారు. వారిని మినహాయించి మిగిలిన వారిని సీబీఐ అరెస్టు చేయడాన్ని బట్టి చూస్తే ఇది కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమైన కేసుగా అర్ధమవుతోందని టీఎంసీ ఆరోపిస్తోంది.