లోయలో పడిన బస్సు: 20 మంది మృతి
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. మరో 15మందికి గాయాలయ్యాయి. సమాచారం అందకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిన్నౌర్ జిల్లాలోని తప్రి నుంచి రాంపూర్ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు నత్పా ప్రాంతంలో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు.
సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎదురుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించి ముందుకు వెళ్లే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పిందని బాధితులు తెలిపారు.
కొండచరియలు విరిగిపడి మహిళ, చిన్నారి మృతి
అస్సోంలోని కామ్రూప్ జిల్లాలో మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అమింగౌన్ ప్రాంతంలో ఉన్నట్టుండి కొండచరియలు విరిగిపడటంతో ఓ మహిళ, చిన్నారి అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాల్ని వెలికితీశారు. గత కొన్ని రోజులుగాకురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ ప్రాంతంలో తరచూ కొండచరియలు విరిగిపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
జీపును ఢీకొన్న రైలు: నలుగురు మృతి
జీపును రైలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. మోయిన్పురి జిల్లాలో కాపలా లేని ఓ రైల్వే క్రాసింగ్ వద్ద భోగాన్ ప్రాంతంలో ప్రయాణీకులతో వెళుతున్న జీపు రైల్వే క్రాసింగ్ దాటుతుండగా రైలు ఢీకొట్టింది. దీంతో జీపులోని నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.