నగల దుకాణాల్లో చోరీ కేసు: కేంద్రమంత్రికి అరెస్ట్ వారెంట్ జారీ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్లో 13 ఏళ్ల క్రితం రెండు నగల దుకాణాల్లో చోరీలకు సంబంధించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్పై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఈ కేసు విచారణ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు చేపట్టింది.
మంత్రితో పాటు మరో నిందితుడిపై కూడా నవంబర్ 11న అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అయితే, నిషిత్ ప్రమాణిక్ న్యాయవాది దులాల్ ఘోష్ వారి తదుపరి చట్టపరమైన చర్యను వెల్లడించలేదు.
2009లో అలీపుర్దూర్ రైల్వే స్టేషన్, బీర్పారా సమీపంలోని నగల దుకాణాల్లో చోరీ ఘటనలు జరిగాయి.

కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు నుంచి అలీపుర్దూర్ కోర్టుకు ఈ కేసును బదిలీ చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జహర్ మజుందార్ బుధవారం పీటీఐకి తెలిపారు.
కాగా, నిషిత్ ప్రమాణిక్ ఉత్తర బెంగాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న దిన్హటా పట్టణంలో నివాసి. 2019లో తొలిసారిగా లోక్సభకు ఎన్నికైన ఈయన 2019 ఫిబ్రవరిలో బీజేపీలో చేరారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆయనను బహిష్కరించింది. ఈ కేసులపై సంప్రదించగా.. అలీపుర్దూర్ పోలీసు సూపరింటెండెంట్ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.












Click it and Unblock the Notifications