ఇదే చివరిసారి, మళ్లీ పోటీచేయను: సిద్దరామయ్య, 2013లోనూ ఇదే చెప్పారు!
బెంగళూరు: మే 12న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. 2013లోనూ ఇదే మాట చెప్పిన ఆయన.. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకే తాజా ఎన్నికల్లో తాను బరిలో దిగాల్సి వచ్చిందన్నారు.
'మరోసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని గతంలో నేను అసెంబ్లీలో చెప్పాను. కానీ కాంగ్రెస్ హైకమాండ్ నన్ను పోటీ చేయాల్సిందిగా కోరింది. ఐదేళ్లుగా సీఎంగా కొనసాగినందునా.. మరోసారి ఆ బాధ్యతను తీసుకోవాలని చెప్పింది' అని సిద్దరామయ్య పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పోటీ చేస్తున్న చాముండేశ్వరి నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, 1983లో లోక్ దళ్ పార్టీ తరుపున చాముండేశ్వరి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు సిద్దరామయ్య. ఇదే నియోజకవర్గం నుంచి ఐదుసార్లు గెలిచిన ఆయన.. రెండుసార్లు ఓటమిని కూడా చవిచూశారు.
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. తాజా ఎన్నికల్లో ఆ స్థానం నుంచి సిద్దరామయ్య కొడుకు పోటీ చేస్తున్నారు. 2018ఎన్నికలకు చాముండేశ్వరి నియోజకవర్గాన్నే మళ్లీ ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్నకు సిద్దరామయ్య ఆసక్తికర సమాధానం చెప్పారు.
'నా రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడే మొదలుపెట్టాను. కాబట్టి నా చివరి పోటీ కూడా ఇక్కడినుంచే ఉండాలనుకుంటున్నాను' అని సిద్దరామయ్య తెలిపారు.
కాగా, సిద్దరామయ్య ప్రస్తుతం రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మైసూరు జిల్లాలోని చాముండేశ్వరితో పాటు, ఉత్తర కర్ణాటకలోని బాదామి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన కొడుకు డా.యతీంద్ర వరుణ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 2+1 ఫార్మూలా అంటూ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో సిద్దరామయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు.
సిద్దరామయ్య సైతం ఆ విమర్శలకు ధీటుగా బదులిస్తున్నారు. అవినీతి మరకలున్న రెడ్డి బ్రదర్స్ కు, అక్రమ మైనింగ్ కేసులో జైలు జీవితం కూడా గడిపిన బీఎస్ యడ్యూరప్పకు మీరెందుకు టికెట్లు ఇచ్చారని ఆయన మోడీని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, గత లోక్ సభ ఎన్నికల్లో మోడీ కూడా రెండు స్థానాల్లో(వారణాసి, వడోదర)ల నుంచి పోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు.
'2014లో ప్రధాని మోడీ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయలేదా?, మరి దాన్నేమంటారు? దానికేం చెబుతారు?' అంటూ సిద్దరామయ్య ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్దం బాగానే నడుస్తోంది. అటు సోషల్ మీడియాలోనూ ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.