జనాభా లెక్కలు: ఉద్యోగాల పేరిట భర్తలు విదేశాలకు... భార్యలేమో ఇక్కడ
న్యూఢిల్లీ: తాజాగా విడుదల చేసిన లెక్కల్లో మనదేశంలో ఇప్పుడు పెళ్ళయిన భర్తల కంటే, పెళ్లయిన భార్యల సంఖ్య 66 లక్షలు ఎక్కువగా ఉందని అధికారికంగా తేలింది. పెళ్లి చేసుకున్న మగవారు ఉద్యోగాల కోసం విదేశాలకు వలస వెళ్లిపోతూ తమ భార్యలను ఇక్కడే వదిలి పెట్టడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న 18 లక్షల మంది బాలికలకు పెళ్లిళ్లు అయినట్లు 2011 నాటి జనాభా లెక్కల్లో తేలింది. ఇక మొత్తం దేశ జనాభా 120 కోట్లు కాగా, వారిలో 58 కోట్ల మందికి పెళ్లిళ్లు అయ్యాయని జనాభా లెక్కల్లో తేలింది. మొత్తం 58 కోట్ల మంది వివాహితుల్లో 29.3 కోట్ల మంది మహిళలు కాగా, 28.7 కోట్ల మంది పురుషులు ఉన్నారు.
అయితే వీళ్లలో విడాకులు తీసుకున్న వాళ్లు, భర్తలు మరణించిన వాళ్లు, విడిగా ఉంటున్న వాళ్ల వివరాలు మాత్రం లేవని పేర్కొంది. రాష్ట్రాల ప్రాతిపదికన చూస్తే కేరళలో పెళ్లయిన ప్రతి ఒక్క పురుషుడికి 1.13 మంది వివాహిత మహిళలున్నారు. ఆ తర్వాతి స్ధానాల్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఉన్నాయి.
ఈ రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య 1.04 నుంచి 1.07 వరకు ఎక్కువగా ఉంది. ఇక మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ లాంటి చోట్ల మాత్రం వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ పెళ్లయిన వారిలో మహిళల కంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. ఇక 20 నుంచి 24 సంవత్సరాలు మధ్య ఉన్న మహిళలు అదే వయసున్న పురుషులను పెళ్లిళ్లు చేసుకోవడంతో 30 శాతంగా నమోదైంది.
15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న 18 లక్షల మంది బాలికల్లో 4.5 లక్షల మంది తల్లలు అయినట్లు జనాభా లెక్కల్లో తేలింది. 10 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు పెళ్లిళ్లు జరిగిన రాష్ట్రాల్లో రాజస్ధాన్ మొదటి స్ధానంలో ఉంది.